ఈటెల రాజేందర్ మేకవన్నె పులి అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటెల రాజేందర్ అని ఆయన వ్యాఖ్యానించారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ తదితరులతో కలిసి తెలంగాణ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈటెల రాజేందర్ కు సీఎం కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
ముదిరాజులకు చేపపిల్లలు కావాలని గతంలో వై ఎస్ రాజశేఖరరెడ్డిని గానీ కిరణ్ కుమార్ రెడ్డినిగానీ ఈటల రాజేందర్ అడగలేదని, అయితే దేవర యంజాల్ భూముల గురించి మాత్రం అడిగారని మంత్రి గంగుల ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ శాసనసభా పక్షం నేతగా ఉన్నప్పుడే ఈటల పదవి దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు. రాజేందర్ ఏనాడూ బీసీలను దగ్గరకు రానీయలేదని ఆయన తెలిపారు. ఈటెల వ్యాపార భాగస్వామ్యులు కూడా బీసీ లు కారని, పైగా బీసీ లను తొక్కే ప్రయత్నం ఆయన చేశారని మంత్రి ఆక్షేపించారు.
తక్కువ టైంలో వేల కోట్లు, వందల ఎకరాలు ఎలా సంపాదించావ్ అని ఆయన ప్రశ్నించారు. ఆరుసార్లు గెలిచింది ఈటెల రాజేందర్ కాదు కేసీఆర్ బొమ్మ గెలిచింది అని మంత్రి తెలిపారు. ఈటెల మనసులో అంతా విషమేనని, ఈటెల రాజేందర్ పచ్చి అబద్ధాల కోరు అని మంత్రి ఆరోపించారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ ప్రభుత్వంపై, సీఎంపై విమర్శలు చేయడం శోచనీయమని అన్నారు.
2001లో టీఆరెస్ పార్టీ కేసీఆర్ పెడితే ఈటెల రాజేందర్ 2003 లోచేరారని ఆయన గుర్తు చేశారు. 50 లక్షల నుంచి కోటిన్నర రూపాయలకు ఎకరం పలికే భూమిని ఆరు లక్షలకు ఎలా కొంటావ్ ఈటెల ? అని మంత్రి ప్రశ్నించారు.