తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనపై హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. విశ్వహిందూపరిషత్ (వీహెచ్పీ), భజరంగదళ్ నేతలు పెద్ద సంఖ్యలో నేడు అంతర్వేది వెళ్లారు.
అదే సమయానికి రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా అక్కడే ఉండటంతో హిందూ ధార్మిక సంస్థలు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మంత్రులు రథం దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించి తిరిగి వస్తుండగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన విశ్వహిందూపరిషత్ (వీహెచ్పీ), భజరంగదళ్ నేతలు, కార్యకర్తలు మంత్రులను నిలదీశారు.
ఈ ఘటనలో కుట్రకోణం ఉందని, సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు అతికష్టంమీద మంత్రులను ఆలయంలోకి తీసుకొచ్చారు.
ఈ క్రమంలో పోలీసులు, వీహెచ్పీ, భజరంగదళ్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. నిరసకారులు బారికేడ్లను దాటి రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.