భూముల క్రయ, విక్రయాల్లో అవినీతి నిర్మూలన, పారదర్శక నిర్వహణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ బిల్లుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఇందులో భాగంగా నేడు వరంగల్ లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ లకు రెవెన్యూ ఉద్యోగులు ఘనంగా సన్మానం చేశారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా చిర స్థాయిలో నిలిచిపోతుందని కొనియాడారు.
అనంతరం మంత్రులు వరంగల్ రూరల్ జిల్లా, దుగ్గొండి మండలంలో దాదాపు మూడు కోట్లకు పైగా అంచనా విలువతో శివాజీ నగర్ లో నిర్మించిన రోడ్డు ప్రారంభించారు.
ఆ తర్వాత33/11 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు. అనంతరం చలపర్తి గ్రామంలో 2 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.