చక్కగా కాస్తున్న పండ్ల తోటకు నిప్పు పెట్టాలన్న దుర్మర్గపు ఆలోచన ఎవడికి వచ్చిందో కానీ బంగారం లాంటి పండ్ల తోట కాలి బుగ్గి అయిపోయింది. కడప జిల్లా నందలూరు మండలం లేబాక గ్రామంలో కొత్తోళ్ల సుబ్రహ్మణ్యం అనే రైతుకు సంబంధించిన మామిడి తోటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.
వారు పెట్టిన నిప్పుకు మండు ఎండ కూడా తోడు కావడంతో దగ్గరలోనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కు మంట అంటుకున్నది. దాంతో తోట మొత్తం దగ్ధం అయింది. పలు రకాల పండ్ల చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. 25 సంవత్సరాల వయసున్న 10 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి.
అలాగే రెండు సపోటా చెట్లు, 3 నిమ్మ చెట్లు కూడా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మొత్తం కాలిపోయింది. కొబ్బరి చెట్లు కింది నుంచి పై వరకు మాడి మసి అయ్యాయి. రైతు కొత్తోళ్ల సుబ్రహ్మణ్యం జీవనోపాధి కోసం కువైట్ లో ఉంటున్నాడు.
పెట్రోలు పోసి తగుల పెట్టారని అనుమానం
ఆయన భార్య గోపాలమ్మ ఇక్కడ నివాసం ఉంటుంది. ఈ విషయం తెలిసి ఆమె పొలం వద్దకు వెళ్లింది. పట్టపగలే తోటలు కాల్చేందుకు ఎవరో ప్రయత్నించినట్లు రైతు కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. కాలిన చోట పెట్రోల్ వాసన వచ్చినట్లు వారు తెలిపారు.
వెంటనే కువైట్ నుంచి రైతు కొత్తోళ్ల సుబ్రహ్మణ్యం జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు వాట్స్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రైతు భార్య గోపాలమ్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు.