వివిధ రంగాల్లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఉదయం 6 గంటల నుంచి కార్మిక సంఘాలు రెండు రోజుల భారత్ బంద్ చేపట్టారు. భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల సంయుక్త వేదిక పిలుపు మేర బంద్ కు మిశ్రమ స్పందన లభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ యోచన, బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి నిరసనగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమ్మెకు మద్దతు ఇచ్చింది. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపు పన్నుశాఖ, బీమా సంస్థల ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నారు. భారత్ బంద్ వల్ల బ్యాంకింగ్ సేవలపైనా సమ్మె ప్రభావం పడింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సమ్మె కు మిశ్రమ స్పందన కనిపించింది. అధికార టిఆర్ఎస్ నేతలు కూడా బందు లో పాల్గొన్నా ప్రజల నుంచి పాక్షిక స్పందన లభించింది. ఆటొ లు తిరగకపోయినా ఆర్టిసి బస్సులు కొన్ని తిరిగాయి. మంత్రులు అందరు యదాద్రి లో వుండటంతో వారంతా సమ్మె కు దూరంగానే వున్నారు. రాశ్స్త్రంలోని అనేక ప్రాంతాలలో కార్మిక సంఘాల నాయకులు తెల్లవారుమునే రోడ్ల పైకి వచ్చి సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఆందోళనలు చేశారు.
పశ్చిమ బెంగాల్లోని హౌరాలో ఇప్పటివరకు రెండు రోజుల భారత్ బంద్కు మిశ్రమ స్పందన లభించింది. ఫ్యాక్టరీల దగ్గర కొన్ని చోట్ల వామపక్ష సంస్థలు బంద్కు మద్దతుగా నినాదాలు చేస్తూ జెండాలు ఊపుతూ కనిపించారు. మార్చి 28, 29 తేదీలలో 48 గంటల దేశవ్యాప్త సమ్మె సందర్భంగా తమ ఉద్యోగులందరినీ విధులకు హాజరు కావాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరింది, లేని పక్షంలో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని సర్కారు హెచ్చరించింది. బీజేపీ, టీఎంసీ పార్టీలు మినహా లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్తో సహా అనేక కార్మిక సంఘాలు కేంద్ర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలు దెబ్బతినే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
బొగ్గు గనుల కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో రాష్ట్రంలోని 23 భూగర్భ,19 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కాగా సమ్మెకు బీఎంఎస్ దూరంగా ఉండగా, టీబీజీకేఎస్ మద్దతు ప్రకటించింది. సమ్మెలో భాగంగా బొగ్గు గనుల వద్ద కార్మిక సంఘాలు నిరసనలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే దాకా పోరాటం సాగుతుందని కార్మిక నేతల వెల్లడించారు.