ఎస్సీ, ఎస్టీలకు రక్షణగా ఉన్న చట్టాన్ని స్వార్ధ రాజకీయాలకు వాడుకున్న వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాజధాని అమరావతి కోసం తామే స్వచ్చందంగా ప్రభుత్వానికి భూములిచ్చామని ఎస్సీ రైతులు సీఐడి విచారణలో వెల్లడించడంతో ఆళ్ల సీఐడి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు తప్పని తేలిపోయిందని ఆయన అన్నారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులను అవమానిస్తున్న వైకాపా, ఇప్పుడు ఏకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకు ఇచ్చిన హక్కులను కూడా లాగేసుకుంటున్నదని ఆయన అన్నారు.
అమరావతి అసైన్డ్ భూముల విషయంలో చంద్రబాబు, నారాయణలపై ఆయన ఫిర్యాదు ఆధారంగా సిఐడి పెట్టిన కేసు దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలను నాలుగు వారాల పాటు హైకోర్టు నిలుపుదల చేసిన విషయం కూడా పరిగణించాలి.
ఈ వ్యవహారాలను పరిశీలిస్తే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కుట్రపూరితంగా తప్పుడు కేసు పెట్టాడని అర్థమవుతుంది అని ఆయన అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఇరికించేందుకు ఆయన చేసిన ఈ ప్రయత్నం అత్యంత హేయమైన చర్య అని సుధాకర్ రెడ్డి అన్నారు.
తమకు ఎలాంటి నష్టం జరగలేదని రాజధానికి భూములు ఇచ్చిన ఎస్ సిలు చెబుతుంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం దళితులను అవమానించినట్లేనని ఆయన తెలిపారు. తక్షణమే ఆళ్ల రామకృష్ణారెడ్డి దళిత జాతికి క్షమాపణలు చెప్పి తప్పుడు ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
పుర పాలక ఎన్నికల్లో వైకాపా చేసిన ఘోరాలు నేరాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే అయన చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టాడని ప్రజలకు అర్థమైనదని, ఎవరి మెప్పు కోసం ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కేసు పెట్టాడో బహిరంగంగా వెల్లడించాలని సుధాకర్ రెడ్డి కోరారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైన, అప్పటి మంత్రి నారాయణ పైనా తప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తక్షణమే ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.