సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా అధికారులు సమన్వయంతో పని చేస్తూ , పనులు వేగవంతం చేయాలని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విజయనగర మండల రెవెన్యూ కార్యాలయంలో గృహ నిర్మాణ పనులు, వేగవంతం పై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటి కల సాకారం అయ్యే విధంగా చూడాలని అన్నారు. సాధ్యమైనంత త్వరగా గృహ నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చూడాలని అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ప్రతి పేదవాడికి సొంతిల్లు అందించడానికి సీఎం జగన్ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని అన్నారు. నగరంలో 5,6,7,35,36,37 డివిజన్లకు సంబంధించి గృహ పట్టాలు ఇవ్వలేదని, దీనికి సంబంధించి స్థల సేకరణ పూర్తయ్యే విధంగా చూడాలన్నారు.
స్థల సేకరణ విషయంలో రెవెన్యూ, శాఖ అధికారులు దృష్టి పెట్టి త్వరితగతిన స్థల సేకరణ చేపట్టాలన్నారు. ఇప్పటికే చాలా సమావేశాలు నిర్వహించుకున్నామని, పనులలో పురోగతి మాత్రం కనబడటం లేదని ఒకింత అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్థల సేకరణ, గృహ నిర్మాణాల విషయంలో శ్రద్ధ చూపాలన్నారు. సంబంధిత విషయాలలో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో హౌసింగ్ కమిటీ ప్రతినిధులు మరియు కార్పొరేటర్లు అయిన ఎస్ వి వి రాజేష్, కంటబుక్త తవిటి రాజులు మాట్లాడారు.
ఈ సమీక్షా సమావేశంలో నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ఇ సరపు రేవతి దేవి, హౌసింగ్ కమిటీ ప్రతినిధులు మరియు కార్పొరేటర్లు గాదం మురళి, మారోజు శ్రీనివాసరావు, ఎండిఓ సత్యనారాయణ, తాసిల్దార్ బంగార్రాజు, డిప్యూటీ తహిశీల్దార్ కోటి, హౌసింగ్ , సర్వే శాఖ అధికారులు, ఆర్. ఐ లు వీఆర్వోలు పాల్గొన్నారు.