రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన కుమారుడు కోనేరు వంశీకృష్ణ కాగజ్ నగర్ పట్టణం లో బస్ స్టాండ్ ఎదురు గా ఉన్న విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరోపణ చేశామని దాన్ని సర్దిపుచ్చుకునే విధంగా ఎమ్మెల్యే సమాధానం చెప్పడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు.
ఎమ్మెల్యే కబ్జా చేసిన ప్రభుత్వ స్థలం మార్కెట్ విలువ సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఉంటుందని, ఇంతటి విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడుకోవడంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. ఈ భూమి విస్తీర్ణం కేవలం 600 చదరపు గజాలు అని ఎమ్మెల్యే చెప్పడం వాస్తవ దూరం అని పాల్వాయి తెలిపారు.
డాక్యుమెంట్ నెంబర్ 714/2020 ప్రకారం కోనేరు వంశీకృష్ణ పేరిట రిజిస్ట్రేషన్ జరిగిన భూమి విస్తీర్ణం 1500 గజాలు, ఈ భూమి కేవలం 600 గజాలు అని చెప్పడంలోనే ఎమ్మెల్యే డొల్లతనం బయట పడుతోందని ఆయన అన్నారు. నిజాలు దాచి ఏదో మతలబు తో విస్తీర్ణాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతుందని ఆయన అన్నారు.
కొందరు వ్యక్తుల నుంచి లక్షలు వెచ్చించి కొన్నామని ఎమ్మెల్యే చెప్పడమే పెద్ద కుంభకోణం. ఎవరా వ్యక్తులు ఎంతకు కొన్నారని అనే విషయం బహిర్గత పరచాలి అని పాల్వాయి డిమాండ్ చేశారు. అప్పటి కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ను ఉపయోగించుకొని ఒక నకిలీ అసెస్మెంట్ కాపీని సంపాదించి, అక్కడ ఒక బెంగునూరు టైల్స్ తో కట్టిన ఇల్లు ఉండేదని చూపి, మొదట కాసం శ్రీనివాస్ అనే వ్యక్తి పేరిట నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు.
రెండవ రిజిస్ట్రేషన్ మిట్ట హనుమంతు అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ పేరిట చేసుకుని అనంతరం కోనేరు వంశీకృష్ణకు ఆయన అమ్మినట్లు చూపారు. కాసం శ్రీనివాస్, మిట్ట హనుమంతు ఎమ్మెల్యే అనుచరులేనని ఆయన అన్నారు. డైరెక్టుగా కోనేరు వంశీకృష్ణ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మధ్యలో ఇద్దరు వ్యక్తుల్ని ఉంచి వారితో ఈ మొత్తం తతంగాన్ని నడిపించడం అంటే కబ్జా కోణం ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోగలరు. ఇంత జరుగుతున్నా నిమ్మకునీరెత్తినట్లు ఉండే ప్రభుత్వ యంత్రాంగమే ప్రథమ ముద్దాయి అని పాల్వాయి ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఈ మొత్తం భూ కుంభకోణం పై సమగ్ర విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని పాల్వాయి తెలిపారు.