మునిసిపల్ ఎన్నికలలో అఖండ విజయం సాధించిన టిఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ సంబురాలతో హోరెత్తింది. టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు తరలివచ్చారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఊరేగింపుగా వచ్చి తెలంగాణ భవన్ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
డప్పులు వాయించి ఆయన కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు టిఆర్ఎస్ వైపు ఉన్నారని గతంలో నిరూపణ కాగా ఈ సారి పట్టణ ప్రాంతాల ప్రజలు కారు గుర్తే తమకు ఇష్టమని తేల్చి చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను అందుకుంటున్న ప్రజలు అందుకు బదులుగా ఓటేశారని ఆయన అన్నారు.
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అద్భుతమైన ప్రచారం టిఆర్ఎస్ కు ఇంత భారీ విజయాన్ని తెచ్చి పెట్టాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రతిపక్షాలు చేసిన వ్యతిరేక ప్రచారం ఎక్కడా ప్రజలను ఆకట్టుకోలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, బిజెపిలు బుద్ధి తెచ్చుకోవాలని మాగంటి గోపీనాథ్ వ్యాఖ్యానించారు.