ఎరువుల ధరలు యథాతథ స్థితిని కొనసాగించాలని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోమారు రుజువైందని అన్నారు. రైతులపై, వ్యవసాయంపై ముప్పేట దాడి చేస్తూ అసంబద్ధ విధానాలను కొనసాగిస్తూ రైతులను నిరాశా నిస్పృహల్లోకి నెట్టివేస్తున్నారని ఆయన అన్నారు.
వ్యవసాయాన్ని కార్పోరేట్ వ్యవస్థకు కట్టబెట్టే కుట్రను కొనసాగిస్తున్నారని, ఎరువుల ధరలను గడిచిన ఆరేళ్ల నుంచి విపరీతంగా పెంచేస్తూ వ్యవసాయాన్ని నష్టాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధానికి లేఖ రాశారని,ఎట్టి పరిస్థితుల్లో ఎరువుల ధరలు పెంచవద్దని ప్రస్తుతం ఉన్నటువంటి యథాతథ స్థితిని కొనసాగించాలని సూచించాలని అన్నారు.
బిజెపి ప్రభుత్వం చెప్పిన మాటలకు చేతులకు ఎక్కడ సంబంధం లేకుండా వ్యవహరిస్తుందని,2016లో రైతుల ఆదాయం 2022 కల్లా రెట్టింపు చేస్తామని ప్రకటించారు కానీ 2022 నాటికి ధరలను రెట్టింపు చేసి రైతుల ఆదాయానికి గండి కొట్టి వ్యవసాయాన్ని నష్టాల బాటలో నడిపిస్తూ వ్యవసాయాన్ని కార్పొరేట్ కౌగిళ్లల్లోకి జత చేస్తున్నారని ఆయన అన్నారు.
పంటల సాగులో అత్యధికంగా ఉపయోగించే ఎరువుల ధరలను 50 శాతం నుండి 100 శాతానికి పెంచారని,కేవలం 90 రోజుల్లోనే ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచి వ్యవసాయంపై,రైతులపై కక్ష తీర్చుకుంటున్నారని,ఈ రకమైన విధానాలు చాలా బాధాకరమని సైదిరెడ్డి అన్నారు. రైతు కోలుకోలేని స్థితిలో ఉన్నాడని, ఈ విధంగా ధరలను పెంచి వ్యవసాయ పెట్టుబడులు పెంచి పెరిగిన ధరలతో రైతుల నడ్డి విరుస్తున్నారని, మరొకవైపు రోజు రోజుకి వ్యవసాయంలో అధునాతన యాంత్రీకరణ పెరిగి పెట్రోల్, డీజిల్ వాడకం పెరిగిందని ఆయన అన్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల పెరిగిన పెట్రోల్,డీజిల్ రేట్లు కూడా వ్యవసాయ రంగంపై,రైతులపై భారంగా పరిణమిస్తున్నాయని,వీటివల్ల కూడా పెట్టుబడులు పెరిగిపోతున్నాయని, ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులకు ఏమాత్రం మేలు చేసేలా లేవని అన్నారు.
వ్యవసాయ రంగాన్ని ఏ మాత్రం ఆదుకునే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదని,గడిచిన ఆరేళ్ల నుంచి ఎరువుల ధరలు పెరుగుతుంటే కేంద్రం చోద్యం చూస్తూందని,పైగా ధరలు పెంచడంతో పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు యూరియా వాడకం,డి ఏ పి తగ్గించాలని రైతులను ఒత్తిడి చేయాలని రాష్ట్రాలను పురిగొల్పుతుందని, దీనితో కేంద్రం బాధ్యతారాహిత్యం మరింతగా స్పష్టంగా కనబడుతుందని సైదిరెడ్డి తెలిపారు.
దిగుమతి సుంకాన్ని భరిస్తూ ధరలను అదుపు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందని, కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటలకు చేతులకు ఎక్కడ సంబంధం లేకుండా ప్రవర్తిస్తుందని,స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను తుంగలో తొక్కి పట్టించుకోకుండా వ్యవహరిస్తూ అడ్డగోలు విధానాలను చేపడుతూ రైతుల నడ్డి విరుస్తున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం సాగు ఖర్చులు కొంత మేరకైనా తగ్గించాలని ఉద్దేశ్యంతో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపితే ఇంతవరకూ దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని,ఇది కేవలం రైతులపై,వ్యవసాయంపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తెలుస్తుందని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ నాణ్యత పేరుతో కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు సరికదా రైతు తాను పండించిన పంటను మార్కెట్లో తానే తక్కువ ధరకు అమ్ముకునేలా పురిగొల్పుతుందని, దీనికితోడు వ్యవసాయ రంగంలో విద్యుత్ సంస్కరణలు అంటూ మోటార్లకు మీటర్లు నిర్ణయం రైతులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయని అన్నారు.
అసంబద్ధ విధానాలను కొనసాగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని,కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తగు సూచనలను లేఖ ద్వారా తెలియపరిచారని, కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎరువుల ధరలు పెంచొద్దని, యధాతథ స్థితిని కొనసాగించాలని,ఇదే విధంగా కేంద్రం తన విధానాలు కొనసాగిస్తుంటే అటు వ్యవసాయం,రైతులు నష్టపోతూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం,తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోరని, ప్రజలు రైతులు కేంద్ర ప్రభుత్వంపై నాగళ్లు ఎత్తి తిరగబడతారని, బిజెపి ని దేశం నుండి కూకటివేళ్లతో సహా కూలుస్తారని అన్నారు.
ఈ ఆందోళనలు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రారంభమై దేశవ్యాప్తంగా కేంద్రానికి వారి అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా రైతు ప్రజా ఆందోళనలు ఉద్యమాలు మిన్నంటుతాయని,బిజెపి ప్రభుత్వాన్ని బిజెపి పార్టీని తుంగలో తొక్కి కనుమరుగు చేస్తారని అన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్