వినాయక చవితి సందర్భంగా తనకు జరిగిన అవమానాన్ని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. హోంమంత్రి మేకతోటి సుచరిత తో కలిసి వెళ్లి తాడేపల్లి నివాసంలో ముఖ్యమంత్రిని ఆమె కలిశారు. కులంపేరుతో తనను దూషించారంటూ ఘటన వివరాలను సీఎంకు ఎమ్మెల్యే శ్రీదేవి తెలియచేశారు. ఈ పరిస్థితిపై తీవ్ర మనస్థాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ మహిళకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగుబలహీన వర్గాలను కలుపుకుని ముందడుగు వేసే వాతావరణం రాష్ట్రంలో ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. అదే విధంగా మహిళల గౌరవానికి భంగం కలిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో అన్నివర్గాలనూ గౌరవించే పరిస్థితి ఉండాలని సీఎం అన్నారు. అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని హోంమంత్రి సుచరితను ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రి పినిపె విశ్వరూప్, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తదితరులు ఉన్నారు.
previous post