కష్టాల్లో ఉన్న వారిని కన్నీటిని తుడిచి, వారి ఆకలి తీర్చడం ఎంతో గొప్ప విషయమని విజయనగరం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం లోని బాబామెట్ట లో హజరత్ ఖాదర్ వలీ బాబా వారి 62వ మహా సూఫీ సుగంధ మహోత్సవాలలో ఎమ్మెల్యే కోలగట్ల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే కోలగట్ల కు సాదర స్వాగతం పలికారు. మహమ్మద్ అతావుల్లా షరీఫ్ బాబాను దర్శించి, ఎమ్మెల్యే కోలగట్ల వారి ఆశీర్వాదం పొందారు. దర్గాలోని ఖాదర్ బాబా కి ఎమ్మెల్యే కోలగట్ల ప్రత్యేక ప్రార్థనలు చేసి చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ శిష్యులంతా వందేళ్లకు పైగా నిత్య అన్నదానం కొనసాగిస్తూ ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారని అన్నారు.
మానసిక శాంతియుత జీవనం కోసం బాబా చేస్తున్న సేవలు వెలకట్టలేనివి అన్నారు. విజయనగరం, కృష్ణాజిల్లాలో లో చేస్తున్న ఆధ్యాత్మిక సేవ తో పాటు, నిత్య అన్నదాన ట్రస్ట్ ద్వారా వేలాది మందికి ఆకలి తీరుస్తున్న ట్రస్ట్ సేవలు అభినందనీయమన్నారు.
బాబాను దర్శించి ఆశీర్వచనం పొందిన వారిలో అయిదవ డివిజన్ కార్పొరేటర్ గాదం మురళి, నాలుగో డివిజన్ కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అతావుల్లా బాబా కుమారులు జాఫర్ సాదిక్, మహమ్మద్ ఖాజా మొహిదీన్, డాక్టర్ మహమ్మద్ ఖలీ లుల్లా షరీఫ్, కాజా ఖాదర్ తదితరులు ఉన్నారు.