హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు.
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణి దేవి అభ్యర్థిత్వాన్ని అందరూ బలపరచాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆమెకున్న అత్యంత క్లీన్ ఇమేజ్ కచ్చితంగా గ్రాడ్యుయేట్లకు నచ్చుతుందనే నమ్మకం ఉన్నదని ఆయన తెలిపారు.
ఇప్పటికే అన్ని వర్గాల నుంచి వాణి దేవికి సానుకూల స్పందన లభిస్తున్నదని కేటీఆర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పని చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా బీజేపీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అసత్య ప్రచారాలు చేయడమే తన పనిగా పెట్టుకున్నదని, మిషన్ భగీరథ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా ఇంటింటికీ నల్ల నీరు మన ప్రభుత్వం అందిస్తే తమ ఘనతగా చెప్పుకుంటున్నది బిజెపి నాయకత్వం అని ఆయన అన్నారు.
వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా తమ ఆసత్యాలను పంచుకుంటున్నదని కేటీఆర్ విమర్శించారు. బిజెపి అసత్యాల ప్రలోభాలకు గురికాకుండా విద్యావంతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పనులను బలంగా చెప్పాలని ఆయన అన్నారు.
బిజెపి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి గత ఆరు సంవత్సరాల్లో గ్రాడ్యుయేట్లకు, గాని తెలంగాణ రాష్ట్రానికి గాని చేసింది ఏమీ లేదని కేటీఆర్ అన్నారు. న్యాయవాదిగా ఉన్న రామచంద్ర రావు సత్యాలు కాకుండా అసత్యాలే మాట్లాడుతున్నారని, బిజెపికి తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే నైతిక హక్కు లేదని కేటీఆర్ అన్నారు.