హుజూరాబాద్ ఉప ఎన్నికలో బిజెపి గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేస్తారా అంటూ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విసిరిన సవాల్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.
పశ్చిమ బెంగాల్ లోని భవానీ పూర్ లో అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలిస్తే ప్రధాని మోడీ రాజీనామా చేశారా అని ఆమె ప్రశ్నించారు.
మమతా బెనర్జీ ఉప ఎన్నికలో గెలవకుండా బిజెపి అన్ని చర్యలు తీసుకున్నదని, భవానీ పూర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బిజెపి కింది స్థాయి కార్యకర్త నుంచి ప్రధాని వరకూ పని చేశారని ఆమె అన్నారు.
మరి అలాంటప్పుడు ఆమె గెలవగానే ప్రధాని రాజీనామా చేశారా అని కవిత ప్రశ్నించారు. కేవలం పత్రికల్లో వార్తలు రావడానికి మాత్రమే బండి సంజయ్ మాట్లాడుతున్నారని కవిత ఎద్దేవా చేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆరెస్ విజయం ఖాయమని ఆమె అన్నారు. అయితే ప్రతి ఎన్నికకు సవాల్ చేయడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు.
రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని ఆమె అన్నారు. కేసీఆర్ గెలిచినన్ని ఎన్నికలు దేశంలో ఎవ్వరూ గెలువలేదని కవిత అన్నారు.