కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో పెరిగుపోతున్న కరోనా వైరస్ గురించి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తన కార్యాలయంలో మునిసిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరు పట్టణం లో ప్రజలు కరోనా వైరస్ నేపధ్యంలో భయబ్రాంతులకు గురి అవుతున్నారని అన్నారు.
కరోనా కేసులు పెరుగుతున్నా మున్సిపల్ అధికారులు శానిటేషన్ విషయం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉయ్యూరు పట్టణంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ అధ్వాన్నంగా ఉంది అని, బాధ్యత నిర్వహణలో అధికారులు విఫలం అయ్యారని రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉయ్యూరు పట్టణ ప్రజల ఆరోగ్యం ,ప్రాణాలు కాపాడటం కోసం వారు కరోనా వైరస్ బారిన పడకుండా ప్రతి వారం ప్రతి రోడ్ లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, హైడ్రో క్లోరైడ్ మిశ్రమం చల్లించాలని, అలాగే ఫాగ్గింగ్ చేయాలని కోరారు. అవసరమైతే ఈ పనులను చేయడానికి 50 మంది శానిటరీ పని వాళ్ళను నియమించుకోవాలని రాజేంద్రప్రసాద్ సూచించారు.
ఈ పనులు అన్ని వారం రోజులలో మున్సిపల్ అధికారులు చెయ్యకపోతే మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానని రాజేంద్రప్రసాద్ అధికారులను హెచ్చరించారు. ఉయ్యూరు పట్టణం లో ఉన్న పరిస్థితులను ప్రజలు పడుతున్న కష్టాలను,ఉయ్యూరు పట్టణ ప్రత్యేక అధికారి ఆర్డీఓ గుడివాడ వారికి,మున్సిపల్ రాష్ట్రఅధికారి డి యం ఏ వారికి ఫోన్ లో వివరించి నిధులను, అదనపు సిబ్బందిని మంజూరు చెయ్యాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ఈడే రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ సూర్య వర్ధన రావు,అకౌంటెంట్ అరవింద, ఉయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగ దుర్గాప్రసాద్ తెలుగు దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.