రాజకీయాలకు అతీతంగా పేద, మధ్యతరగతి కుటుంబాలను అందరూ కలిసి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ కోరారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతి 18వ వార్డులో అబ్దుల్ సగీర్ సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్దుల్ నజీర్ పర్యవేక్షణలో 600 కుటుంబాలకు ఇంటింటికి కూరగాయలు, కోడిగుడ్లు పంపిణి కార్యక్రమం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ వలన పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలోనే రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఒక్కటిగా ఈ విపత్తును ఎదుర్కోవాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సమయంలో ప్రణాళిక బద్దంగా ఆలోచించి మేమున్నామనే భరోసా ఇవ్వాలేగాని ప్రజలను గందరగోళానికి గురిచెయ్యగూడదని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అలాగే 18వార్డ్ లో ఇంటింటికి కోడిగుడ్లు, కూరగాయలు పంపిణి చేస్తున్న నజీర్ ని, సగీర్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో వీరంకి చింతయ్య, సయ్యద్ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి, బాషా, సగీర్ యూత్ 18 వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.