గ్రేటర్ పోరు ముగియడంతో రాష్ట్రంలో పార్టీలన్నీఇక రానున్నఎన్నికలపై దృష్టి సారించనున్నాయి. అవన్నీపార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకం కానున్నాయనే చెప్పుకోవచ్చు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలతో పాటు వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అలర్ట్ కాగా, ఇక బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలైతే ఇప్పటికే జీహెచ్ఎంసీ ఓటర్లు ఇచ్చిన తీర్పుతో ఒకింత నూతనోత్సాహంతో సిద్దమవుతున్నాయి.
నోముల స్థానానికి ఎన్నికలెప్పుడో?
అలాగే ఇటీవల నాగార్జునసాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య మరణించడంతో ఆ స్థానానికి కూడా ఆరునెలల్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మార్చి నెలలోపు గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి భాజపా ప్రాతినిథ్యం వహిస్తుండగా, వరంగల్-నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల స్థానానికి తెరాస ప్రాతినిథ్యం వహిస్తోంది. సిట్టింగ్ స్థానాన్నినిలబెట్టుకోవడంతో పాటు మరో స్థానాన్నికైవసం చేసుకోవడానికి తెరాస, భాజపాలు తీవ్రంగా పోటీ పడనున్నాయి.
ఎమ్మెల్సీ స్థానాల కైవసానికి పార్టీలు రెడీ?
దుబ్బాక గెలుపుతో పాటు గ్రేటర్లో 49 డివిజన్లను దక్కించుకున్నభాజపా ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. అధికార తెరాస కూడా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కైవసం చేసుకోవడానికి ఓటర్ల నమోదు ప్రక్రియలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించింది. వరంగల్, ఖమ్మం రెండు కార్పొరేషన్లను గత ఎన్నికల్లో సొంతం చేసుకున్నతెరాస ఈసారి కూడా ఆ ఆధిపత్యాన్నికొనసాగించేందుకు ప్రత్యేక దృష్టి సారించనుంది. దుబ్బాక, గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో తెరాస అప్రమత్తంగా వ్యవహరించనుంది.
ఆ ముగ్గురికి సాగర్లో అగ్నిపరీక్షే
నోముల నర్సింహయ్య మృతితో జరగనున్ననాగార్జునసాగర్లో గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలో అక్కడ జరగనున్నఉప ఎన్నిక తెరాస, కాంగ్రెస్లకే కాక బీజేపీకీ కూడా సాగర్లో అగ్నిపరీక్షనని ఈ ఎన్నికలు గెలిచి అయినా బీజేపీ విజయాన్ని నిరోధించాలని టీఆర్ఎస్ భావిస్తుండగా, మరో వైపు ఇక్కడి నుంచైనా బోణీ కొట్టడం ప్రారంభించాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇక్కడి నుంచి అవే పాత వ్యూహాలను అమలు చేస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలని ఏదేమైనా ఈ ఎన్నికలు కూడా ఈ మూడుపార్టీలకు అగ్నిపరీక్షే కానున్నాయి.
పడకంటి నాగరాజు