ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సమస్యలను తీర్చేందుకు ప్రయత్నించిన ప్రధాని నరేంద్రమోదీ చర్యలపై జనసేన భగ్గుమంటున్నది. తెలంగాణ లో రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీవ్రంగా విమర్శిస్తున్న వై ఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి యాత్రను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను అరెస్టు కూడా చేశారు.
బలవంతంగా ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేసి షర్మిలను పరామర్శించారు. జీ 20 దేశాలకు భారత్ నాయకత్వం వహిస్తున్న సందర్భంగా ఢిల్లీలో ప్రధాని మోదీ ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి 40 పార్టీల అధినేతలను ఆహ్వానించారు. అందులో ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. అధికారిక సమావేశం తర్వాత ప్రధాని మోదీ సీఎం జగన్ తో కొద్ది సేపు మాట్లాడారు.
ఈ సందర్భంగా షర్మిల అరెస్టు విషయం ప్రస్తావించడం, అందుకు జగన్ సరైన సమాధానం ఇవ్వకపోవడం, తమ కుటుంబం మధ్య వివాదాలు ఉన్నాయనే విషయం చెప్పడం లాంటి అంశాలపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రధాని మోదీ మాత్రం అనంతరం షర్మిలకు ఫోన్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన సంఘటనపై పరామర్శించేందుకు ఆయన ఫోన్ చేసినట్లు చెబుతున్నా కూడా జగన్ కుటుంబ సమస్యలు తీర్చేందుకు ప్రధాని మోదీ పెద్దరికం వహిస్తున్నారనే విషయం కూడా గుప్పుమన్నది.
షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్ చేసి పది నిమిషాలు మాట్లాడారనే వార్తలపై జనసేన రగిలిపోతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత దారుణంగా అవమానించిన సందర్భంలో ప్రధాని ఏ మాత్రం స్పందన వ్యక్తం చేయలేదనే విషయాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. విశాఖ పట్నంలో పవన్ కల్యాణ్ ను హోటల్ లోనే బంధించడం, సభకు అనుమతించకపోవడంతో బాటు దాదాపు 40 మంది కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టడం తెలిసిందే.
ఏడుగురు నాయకులను పోలీసులు జైలుకు పంపించారు కూడా. విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టిన వైసీపీ మంత్రులను వదిలేసి తమ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంత జరిగినా కూడా మోదీ నుంచి ఇలాంటి స్పందన ఎందుకు రాలేదని జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మోదీకి షర్మిల కృతజ్ఞతలు చెప్పడం జనసేనకు మరింత కోపం తెప్పిస్తోంది.
షర్మిలకు ఫోన్ చేసి తామున్నామనే భరోసా మిత్రుడైన తమ నాయకుడికి మోదీ ఎందుకు ఇవ్వలేదని జనసేన కార్యకర్తలు, నాయకులు ప్రశ్నిస్తున్నారు. పవన్పై మోదీ ప్రేమ ఇదేనా? అని నిలదీస్తున్నారు. బీజేపీని మతతత్వ పార్టీగా విమర్శించే షర్మిలపై మోదీ సానుభూతి చూపడం దేనికి సంకేతమని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే జీ-20 సన్నాహక సమావేశానికి పవన్ను ఆహ్వానించకపోవడం బీజేపీ నిర్లక్ష్యానికి నిదర్శనమని జనసేన విమర్శిస్తోంది. పవన్కు మోదీ ఫోన్ చేయకపోవడం కంటే, షర్మిలతో మాట్లాడాన్ని జనసేన జీర్ణించుకోలేకపోతోంది.