భారతదేశం 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో వెల్లడించారు. ఇది దేశ సామర్థ్యాన్ని సూచిస్తున్నదని ఆయన వెల్లడించారు. ప్రపంచంలో భారతీయ వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని ఆయన తెలిపారు. భారతదేశ ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టబోదని ప్రధాని చెప్పారు. ప్రతి భారతీయుడు ‘వోకల్ ఫర్ లోకల్’ అయితే ‘లోకల్ నుంచి గ్లోబల్’గా మారడానికి ఎంతో సమయం పట్టదని స్పష్టం చేశారు.
రైతులు, కళాకారులు, చేనేతకారులు, ఇంజినీర్లు, చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఇకీ, వివిధ రంగాల్లోని నిపుణులు మన దేశానికి బలమని ప్రధాని చెప్పారు. వీరందరి కఠోర శ్రమ కారణంగానే 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం నెరవేరిందని తెలిపారు. భారతీయుల ఈ శక్తి, సామర్థ్యాలు ఇప్పుడు ప్రపంచంలోని అన్ని మూలల్లోని నూతన మార్కెట్లకు చేరుకుంటోందని తెలిపారు. మన ఉత్పత్తుల కీర్తిని మరింత పెంచుదామని, లోకల్ను గ్లోబల్గా వృద్ధి చేద్దామని ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఈ- మార్కెట్ప్లేస్ పోర్టల్ (GeM) పోర్టల్ ద్వారా ప్రభుత్వం వస్తువులను కొనుగోలు చేసిందని, దాదాపు 1.5 లక్షల మంది చిన్న వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తిని నేరుగా ప్రభుత్వానికి విక్రయిస్తున్నారని ప్రధాని హైలైట్ చేశారు. ‘ఇంతకుముందు, పెద్ద వ్యక్తులు మాత్రమే ప్రభుత్వానికి ఉత్పత్తులను విక్రయించగలరని విశ్వసించేవారు, కానీ ప్రభుత్వ ఈ-మార్కెట్ పోర్టల్ ఈ వైఖరిని మార్చింది; ఇది నూతన భారతదేశ స్ఫూర్తిని చూపుతుంది’ అని చెప్పారు.
నేడు ప్రపంచం ఏ విధంగా యోగా, ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతోందో మనం చూస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ఈ నెలలో కతార్లో యోగా కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 114 దేశాలవారు పాల్గొన్నారు. ఇండియన్ ఎంబసీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్లో, భారతీయులకు, కతార్కు గర్వకారణమైన చారిత్రక క్షణాలు నమోదయ్యాయని తెలిపింది.