ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం ఎప్పుడూ గవర్నర్, సీఎంలతోపాటు ఆయా రాష్ర్ట భద్రతాధికారులకు కూడా ఆహ్వానం అందేది. కానీ శనివారంనాటి మోదీ పర్యటనకు మాత్రం గవర్నర్, సీఎంలకు ఆహ్వానం లభించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రధాని పర్యటన నిమిత్తం కేవలం ఐదుగురికి మాత్రమే స్వాగతం పలికేందుకు అవకాశం కల్పించినట్లు ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్ రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు ఫోన్ ద్వారా తెలపడం చర్చనీయాంశంగా మారింది.
హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతామొహంతి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాత్రమే రావాలని పీఎంవో నుంచి స్పష్టమైన ఆదేశాలు పంపింది.
మోదీ అహ్మదాబాద్ పర్యటన అనంతరం నేరుగా హైదరాబాద్ రానున్నారు. భారత్ బయోటెక్ను సందర్శించి కరోనా టీకాపై చర్చలు జరిపే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం నేరుగా ప్రధాని మోదీ పూణే వెళ్లనున్నారు.
మరో వైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ నేటి సాయంత్రం లాల్దర్వాజలో ఎన్నికల బహిరంగ సభ నిర్వహించనుండగా, ఇటు సీఎం కేసీఆర్ ఎల్బీస్టేడియంలో బహిరంగసభ నిర్వహిస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో కూడా మోదీ రాకకు ఎవ్వరికీ అనుమతి లభించలేదనే వాదనలూ ఉన్నాయి.