సేంద్రీయ వ్యవసాయం రైతును అప్పుల నుంచి బయటకు తేవడమే కాక ఆర్థికంగా అభివృద్ది చేస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీప్ మోహ న్ రావు భగవత్ అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామంలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సేంద్రీయ రైతు కుటుంబాల సమ్మేళనానికి ఆయన చీప్ గెస్ట్గా హాజరయ్యారు.
గో మాత, భరతమాత, బలరాముడి ఫోటోల వద్ద ప్రత్యేక పూజలు చేసారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సేంద్రీయ పంటలను సాగు చేస్తున్న పలువురు రైతులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సేంద్రియ రైతులను చూసి నాలో ఉత్సాహం పెరిగిందన్నారు. విదేశాల్లో రసాయనాలతో పండించే పంటలు చూడానికి ఆకర్షణగా ఉన్న, వాటిలో పోషకాలుండని, రుచి కూడా ఉండదన్నారు.
రైతులు ఏ యూనివర్సిటీ నుండి వచ్చిన మేధావులకు తక్కువ కాదని వ్యవసాయ క్షేత్రమే ప్రయోగశాల, రైతే శాస్త్రవేత్త అన్నారు.
రసాయనాల వల్లే రైతు అప్పుల పాలు
రసాయనాలు కొనుగోలు చేయడం వల్లే రైతు అప్పుల పాలవుతున్నారన్నారు. గో ఆధారిత ఉత్పత్తుల ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేసి పంటలు సాగుచేసినట్లైతే భూమి సారవంతంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే పంట ఉత్పత్తులను పండించవచ్చన్నారు.
వ్యవసాయ భూమిని తల్లిగా భావించి కాపాడుకుంటే అది మనల్ని రక్షిస్తుందని, ప్రతి చోట ప్రతి చోట సేంద్రియ వ్యవసాయం మొదలై, అమృతమయమైన ఆహారం పండించాలన్నదే తన కోరిక అన్నారు. భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికే అన్నం పెట్టిందని , ఆంగ్లేయులు వచ్చాక సేంద్రీయ వ్యవసాయాన్ని నాశనం చేసారన్నారు.
రైతు తలచుకుంటే అసాధ్యమైందీ ఏదీ లేదని ప్రతి ఒక్కరూ సేంద్రీయ సాగుపై దృష్టిసారించి పర్యావరణాన్ని, నేలతల్లిని కాపాడాలని, సమాజా ఆరోగ్యానికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. ఏకలవ్య పౌండేషన్ చైర్మన్ పి.వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 2016 మార్చిలో ఏకలవ్య పౌండేషన్ను ఉట్నూర్ కేంద్రంగా ఏర్పాటు చేసామని ప్రస్తుతం ఇంద్రవెల్లి మండలంలో 80శాతం గ్రామాల్లో వాటర్షెడ్లను నిర్మించామన్నారు.
మరో 20శాతం గ్రామాల్లోనూ రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు వికారాబాద్, మెదక్ ఆరు జిల్లాల్లో సేంద్రీయ సాగును పెంచేందుకు పౌండేషన్ పనిచేస్తుందన్నారు. ఏపీలో విశాఖ , కడప జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
వికరాబాద్ జిల్లా జింగురిలో వంద ఎకరాల్లో సేంద్రీయ సాగు డిప్లోమా కాలేజీ నిర్వహిస్తున్నమన్నారు. సేంద్రీయ పంట ఉత్పత్తులకు మార్కెట్ను కల్పించేలా రైతు సంఘాలను సైతం ఏర్పాటు చేసామన్నారు.
సేంద్రీయ వ్యవసాయాన్ని పది వేల ఎకరాలకు పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రైతులు సైతం అందుకు సహకరిస్తున్నారని వెల్లడించారు. జిల్లాలోని పది గ్రామాల్లో సాయంత్రం ట్యూషన్లు చెప్పే కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నామన్నారు.
నారాయణ మహారాజ్ మాట్లాడుతూ మంచి ఆహారంతో మంచి ఆలోచన , మంచి నడవడిక అలవడుతుందన్నారు. సేంద్రీయ సాగుతోనే రుచికరమైన కలుషీతం లేని ఆహారం లభిస్తుందన్నారు. దేశాన్ని ఉన్నతస్థాయిలో నిలుపాలన్నా, సమాజ వికాసం, దేశ సౌభాగ్యం సేంద్రీయ సాగుతోనే సాధ్యమని ఆదిశగా రైతులు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఏకలవ్య పౌండేషన్ సేవలను అభినందించారు.
ఆకట్టుకున్న సేంద్రీయ ఉత్పత్తుల ప్రదర్శన
సమ్మేళనంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సేంద్రీయ రైతులు సాగు చేసిన పంట ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లు రైతులను ఆకట్టుకున్నాయి. బియ్యం, గోధుమలు, వడ్లు, పప్పుదినుసులు, చిరు ధాన్యాలు, కూరగాయాలు పూర్తిగా సేంద్రీయ విధానంలో సాగు చేసిన రైతులు ప్రదర్శనలో ఉంచారు. ఈ సమ్మేళనానికి హాజరైన రైతులు ఈ స్టాల్ను తిలకించి వాటికి సంబంధించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.