తమపై మోపిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని నేతన్నల ఐక్య కార్యచరణ కమిటీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ నార్త్ జోన్ డిప్యూటీ పోలీస్ కమీషనర్ కళమేశ్వర్ కు ఈ మేరకు నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ ముఖ్య నాయకులు వినతి పత్రం అందచేశారు.
అన్యాయాన్ని ప్రశ్నించినందుకు మోండా మార్కెట్ పోలీసులు తమపైనే అక్రమ కేసులు నమోదు చేసారని ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ దాసు సురేష్ ఆరోపించారు. గతనెల 2వ తేదీన సికింద్రాబాద్ లోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్ లో కొన్న పట్టు వస్త్రాలను నకిలివని గుర్తించి యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో పాటు చేనేత కార్మికుల జీవితాలతో అడుకోవద్దని కోరుతూ షాప్ ముందు ఆందోళన చేశారు. షాపు పైన చర్యలు తీసుకోవాలని కూడా మోండా మార్కెట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
అయితే తమ ఫిర్యాదును నమోదు చేసుకోకుండా వారం రోజుల తరువాత సదరు షాపింగ్ మాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి తమను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని దాసు సురేష్ డీసీపీ కి వెల్లడించారు. కార్పొరేట్ షాపింగ్ మాల్ లు మోసపూరిత ప్రకటనలు ద్వారా బడుగు, బలహీన వర్గాలకు చెందిన చేనేతల పొట్టలు కొడుతూ, తమ ఆస్తులను పెంచుకుంటున్నారని, ఇది అన్యాయమని ప్రశ్నించిన గొంతుకలను ధనబలంతో తొక్కాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇమిటేషన్ పట్టు వస్త్రాలను అమ్ముతున్న షాపింగ్ మాల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ మాన్యువల్ ప్రకారం 41 నోటీసు ఇవ్వకుండా గత రెండు వారాలుగా పోలీస్ స్టేషన్ కి రమ్మని తమని పోలీసులు మానసికంగా వేధించడం బాధాకరమని దాసు సురేష్ అభిప్రాయపడ్డారు. చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుండి కృత్రిమ సిల్క్ ను దిగుమతి చేసుకుని దేశంలో చేనేత, పట్టు వ్యవస్థలను కార్పొరేట్ సంస్థలు నాశనం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ బూటకపు వ్యాపారానికి సినీనటులు ప్రకటనలు ఇవ్వడం మానుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో చేనేత బలహీన వర్గాల నాయకులు మట్ట జయంతి, హరీష్ గౌడ్, బొమ్మ నరేందర్ నేత, మండల రణధీర్, అల్లబోయిన రాకేష్ యాదవ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.