31.2 C
Hyderabad
April 19, 2024 06: 35 AM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

పల్నాడు పాపం ఎవరిది చంద్రబాబూ?

chandrababu palnadu

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంపై ఇప్పుడు ఎనలేని ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబునాయుడు ఏనాడూ ఆ ప్రాంత సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మరీ ముఖ్యంగా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో పల్నాడు ప్రాంతం నానాటికీ తీసికొట్టు నాగంభొట్లు అన్నట్టుగా మారిందే తప్ప ఎక్కడా అభివృద్ధి కనిపించదు. రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల కన్నా వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, పేదరికం ఎక్కువగా కనిపించే ప్రాంతం పల్నాడు.

అలాంటి ప్రాంతాన్నిచంద్రబాబునాయుడు పూర్తిగా అశ్రద్ధ చేశారు. పల్నాడులో పేదరికం కారణంగా కిడ్నీలు అమ్ముకుని బతికిన ప్రజలు ఉన్నారు. పక్కనే కృష్ణానది పారుతున్నా గుక్కెడు నీరు ఉండని ప్రాంతాలు పల్నాడులో అడుగడుగునా ఈనాటికీ కనిపిస్తాయి. కులాల పరంగా చూస్తే పల్నాడు ప్రాంతం అంతా కూడా చాలా కాలం వరకూ రెడ్డి డామినేషన్ ఉండేది. ప్రతి గ్రామంలో రెడ్లు అధికారం చెలాయించే వారు. నరసరావుపేటకు ప్రాతినిధ్యం వహించిన కాసు బ్రహ్మానందరెడ్డి తానకు తాను జాతీయ స్థాయి నాయకుడు అనుకునేవారు తప్ప స్థానిక సమస్యలు పట్టించుకోలేదు.

నరసరావుపేట పార్లమెంటు స్థానం వలస పక్షులకు ఆశ్రయంగా ఉందే తప్ప స్థానిక సమస్యలు తీర్చే నాయకుడు ఇప్పటి వరకూ రాలేదు. బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ గెలిచి ఆ తర్వాత సర్దుకు పోయిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు చెబుతున్నఫ్యాక్షన్ రాజకీయాలు గతంలో పల్నాడులో ఉండేవి కాదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడి చేతుల్లోకి వచ్చిన తర్వాత కమ్మ కులస్తుల ప్రాబల్యం ఆ ప్రాంతంలో పెరిగిపోయింది.

దాంతో తరచూ కుల ఘర్షణలు జరుగుతుండేవి. ఈ కుల ఘర్షణల్లో రెడ్లు, కమ్మ కులస్తులు కాకుండా దళితులు, ఇతర వెనుకబడిన కులాల వారు ఎక్కువగా మరణిస్తుండేవారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న ప్రతి సారీ కమ్మ కులస్తుడిని మంత్రిని చేసేవారు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు  రెడ్డి కులస్తుడిని మంత్రిని చేసేవారు. కేవలం రాజకీయ కారణాలతోనే పల్నాడులో ఫ్యాక్షన్ గొడవలు మొదలు పెట్టారు ఈ రాజకీయ నాయకులు. అన్నింటా వెనుకబడి ఉన్నపల్నాడు ప్రజలలో ఫ్యాక్షన్ గొడవలకు పాల్పడే ఓపిక తీరికా ఉండవు. జీవనోపాథి కోసం వెంపర్లాడేవాడు రాజకీయ గొడవల్లోకి ఎందుకు వెళతాడు?

రాజకీయాన్ని జీవనోపాధిగా మార్చిన రాజకీయ నాయకులు పల్నాడుతో తొలి నుంచి ఆడుకుంటూనే ఉన్నారు. చంద్రబాబునాయుడు పల్నాడు ప్రాంత అభివృద్ధికి చేసింది ఏమీ లేదు. కేవలం ఒక సామాజిక వర్గానికి ప్రోత్సాహం తప్ప. అలా పెరిగిపోయిన కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావులు కోట్లాది రూపాయలు సంపాదించారు. ఇది సహజంగా రెడ్డి డామినేషన్ ఉన్న పల్నాడు ప్రాంతంలో తిరుగుబాటు తెచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీ అక్కడ తుడిచిపెట్టుకుపోయింది. గతంలో జరిగింది ఒక ఎత్తు అయితే గత ఐదేళ్లలో జరిగింది మరొక ఎత్తు.

అందుకే పల్నాడు ప్రాంత ప్రజల్లో ఇంత తిరుగుబాటు వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఒక్కచంద్రబాబునాయుడి సామాజికవర్గంలో తప్ప మరెక్కడా అశాంతి కనిపించలేదు. కోడెలపై కేసులు, యరపతినేని పై సిబిఐ కేసులు పత్తిపాటి పుల్లారావు పై కేసులు తదితర అంశాలతో తెలుగుదేశం పార్టీ అతలాకుతలం అయిపోతున్నది. పల్నాడులో మళ్లీ రెడ్డి సామాజిక వర్గం వేళ్లూనుకుంటుందేమోననే భయం ఆందోళన తెలుగుదేశం పార్టీని పట్టికుదిపేస్తున్నది.

అందుకే చంద్రబాబు ప్లాన్ వేసి పల్నాడు సమస్యను పైకి తీసుకువచ్చారు. వాస్తవానికి ఇది రెండు కులాల ఆధిపత్య పోరు తప్ప పేదరికంలో ఇంకా మగ్గుతూనే ఉన్న పల్నాడు ప్రజలది కాదు. చంద్రబాబునాయుడు కుత్సిత రాజకీయాలు మానుకుంటే కొంత కాలానికైనా పల్నాడు ప్రాంతం కనీసం అభివృద్ధికైనానోచుకుంటుంది.

Related posts

కొత్త‌ జిల్లా ఏర్పాటు ఉన్న‌ప్ప‌టికీ విజయనగరం జిల్లా కేంద్రంలోనే ఉగాది వేడుక‌లు

Satyam NEWS

నాన్ అక్రిడిటేటెడ్ జర్నలిస్టులకు సైతం వ్యాక్సిన్

Satyam NEWS

జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment