రెండు తెలుగు రాష్ట్రాలలో మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. ఏదో ఒక కారణంతో మహిళలను చంపేస్తూనే ఉన్నారు. ఓ మహిళను దారుణంగా కొట్టి చంపి, ఏడాది వయసు కుమార్తెను గొంతుకోసి చంపి మృతదేహాలను పెట్రోల్ పోసి కాల్చివేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
సుమారు పాతికేళ్ల వయసున్న మహిళ, ఏడాది వయసున్న ఆడబిడ్డను మద్దిపాడు మండలం పేర్నమిట్ట- లింగంగుంట గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. రోడ్డు పక్కన కాల్చిన స్థితిలో పడి ఉన్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఒంగోలు రూరల్ సీఐ పి.సుబ్బారావు, ఒంగోలు సీఐ ఎం.లక్ష్మణ్, మద్దిపాడు ఎస్సై ఖాదర్బాషా తమ సిబ్బందితో నేరస్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు ఎవరన్నది తెలియరాలేదు. ఆమె వివరాలు తెలిస్తే హత్య ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది.