చిన్న తనంలో కంటికి రెప్పలా చూసుకుని, అడిగినవన్నీ ఇచ్చి పెద్ద చేసిన తల్లినే కాటికి పంపిస్తున్న తనయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రక్త సంబంధాలు మరచి చిన్న చిన్న విషయాలకే దారుణంగా హత్యలకు పాల్పడుతున్న దుర్మార్గులు తరచూ తారసపడుతున్నారు.
కడపజిల్లా సిద్ధవటం మండలం మాధవరం గ్రామం పార్వతీపురం లో జరిగిన ఈ సంఘటన నాగరిక సమాజానికే తలవంపులు తెస్తున్నది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మండలంలోని మాధవరం గ్రామపంచాయతీ పార్వతీపురం కు చెందిన చింత గింజల సీతా రాములమ్మ (65)ను మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆమె కుమారుడు బ్రహ్మయ్య రోకలిబండతో దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు ఒంటిమిట్ట సిఐ హనుమంతు నాయక్ తెలియజేశారు.
మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిపారు. చిన్న కుమారుడు బ్రహ్మయ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతూ మద్యానికి బానిసై విపరీతంగా అప్పులు చేసి మంగళవారం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లితో ఘర్షణ పడ్డాడు.
రోకలిబండతో తలపై బాది హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. చింత గింజల సీతా రాములమ్మ పెద్ద కొడుకు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలించినట్లు తెలియజేశారు.
మీడియా సమావేశంలో సిద్ధవటం ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఏ ఎస్ ఐ శ్రీనివాసులు మహిళ కానిస్టేబుల్ పాల్గొన్నారు.