కాన్పు అయిన వెంటనే అర గంట లోపు పసి పిల్లలకు ముర్రుపాలు తాగించాలని ఆరోగ్య బోధకులు దస్తిరామ్ కోరారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బిచ్కుంద మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల విశిష్టతపై ఆరోగ్య బోధకులు దస్తిరామ్ వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిపాలే శ్రేష్టమైనవని ఆరోగ్యవంతమైనవి ,కమ్మనైనవి,కల్తీ లేనివి , వెలకట్టలేనివి అని ఆయన అన్నారు. ముర్రుపాలలో కొలెస్ట్రం ఉంటుందని అది శిశువు ఆరోగ్యానికి వ్యాధి నిరోధక శక్తిని అందిస్తుందన్నారు.
శిశువు శరీరంలోని మలినాలను తీసివేసి మలమూత్ర విసర్జన రూపంలో బయటకు పంపిస్తుందన్నారు. అలర్జీ న్యుమోనియా లాంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా దోహదపడుతుందన్నారు. శిశువుకు తల్లిపాలు ఆరు నెలల వరకు వాడలని శిశువుకు సరిపోయే పోషకాలన్నీ తల్లి పాలలోనే ఉంటాయని గుర్తు చేశారు.
ఆరు నెలల తర్వాత శిశువుకు తల్లి పాలతో పాటు శరీర పోషణకు అవసరమైన ఆహారాన్ని అలవాటు చేయాలన్నారు. కానీ ఆరు నెలల లోపు మాత్రం ఎటువంటి పానీయాలను చిన్నారులకు ఇవ్వరాదని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆరోగ్య కార్యకర్త ఫ్లారెన్స్ ,లక్ష్మి ,అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.