ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయని పోలీసులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కు నలుగురు ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఎంపీ రఘురామకృష్ణంరాజు తరపున ఆయన వ్యక్తిగత సహాయకుడు కె యు కృష్ణ వర్మ ఈ మేరకు లేఖ రాశారు. ఎంపీ రఘురామకృష్ణమరాజును అసభ్య పదజాలంతో దూషించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అలాంటి వారిని గుర్తించి ఆచంట, ఉండి, తాడేపల్లిగూడెం, ఆకివీడు పీఎస్ లో ఎంపీ తరపున వర్మ రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు.
అయితే ఇప్పటికీ సంబంధిత ఎస్ఐలు వారిపై కేసులు నమోదు చేయలేదని, కేసులు నమోదు చేయని కారణంగా ఆ నాలుగు స్టేషన్ల ఎస్ హెచ్ఓలపై సీఆర్ పీసీ 154(3) సెక్షన్ ప్రకారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వర్మ తెలిపారు. నలుగురు ఎస్ హెచ్ ఓలపై చర్యలు తీసుకోవాలని, అందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.