39.2 C
Hyderabad
April 25, 2024 15: 33 PM
Slider ప్రత్యేకం

పోలీసు అధికారులే నన్ను చంపాలని చూస్తున్నారు

#Raghuramakrishnam Raju MP

ఏపీ సీఎం జగన్‌ ప్రతీకారేచ్ఛతో అధికారాలను దుర్వినియోగం చేస్తూ సీఐడీ పోలీసులతో తనపై రాజద్రోహం కేసు మోపి.. కస్టడీలోకి తీసుకొని హింసించారని, సీఎం జగన్‌, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రలతో తనకు ప్రాణహాని ఉందని తనను కాపాడాలని పార్లమెంటు సభ్యులకు నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె.రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.

‘‘కట్టుకథలతో లెక్కకు మిక్కిలి కేసులు బనాయిస్తుండడంతో 30 నెలలుగా నేను నా నియోజకవర్గానికి వెళ్లలేదు. ఆయా కేసుల్లో ఇప్పటికే 12 స్టేలు ఉన్నాయి. నాకున్న ముప్పును గుర్తించి కేంద్ర హోంశాఖ రెండేళ్ల కిందట వై కేటగిరి భద్రత కల్పించింది. ఫిబ్రవరి 26న నాపై ఒక పోలీసు రెక్కీ నిర్వహించారు. నాకు భద్రతగా ఉన్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది గుర్తించి అతన్ని పోలీసులకు అప్పగించారు. అతడిపై పోలీసులు ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు. జులై 3న భీమవరం వెళ్లేందుకు నేను రైలు బోగీ బుక్‌ చేసుకున్నా. రైలులోనే నాపై దాడి జరిగే అవకాశముందని సమాచారం అందింది. ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులుగా చెప్పుకొంటున్న ఇద్దరిని సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది రైలులో పట్టుకొని నన్ను కాపాడారు. దాంతో నేను పక్క స్టేషన్‌లో దిగిపోయా. నేను ఇంటికెళ్లాక నంబరు లేని కారు నా ఇంటి చుట్టూ తిరుగుతోందని రక్షణ సిబ్బంది గమనించారు. మా ఇంటి సీసీ కెమెరాల్లో అది రికార్డయింది. ఫుటేజీ కోసం ప్రయత్నిస్తే దాన్ని ఇవ్వవద్దని గచ్చిబౌలి ఎస్‌హెచ్‌వో చెప్పారని మా గేటెడ్‌ కమ్యూనిటీ సెక్యూరిటీ హెడ్‌ తెలిపారు. ఇది ఏపీ పోలీసులకు, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రకున్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తోంది’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

అసలు ఫిర్యాదు వదిలేసి తప్పుడు ఫిర్యాదుపై కేసు నమోదు

“అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ జులై 4న భీమవరం వచ్చారు. ప్రొటోకాల్‌ ప్రకారం నేను కూడా ప్రధానిని ఆహ్వానించాలి. కానీ నేను భీమవరం వెళ్లకుండా ఏపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. అదే రోజు నా ఇంటి వద్ద తచ్చాడుతున్న ఒకరిని సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారు. అతన్ని ప్రశ్నిస్తే తొలుత సమాచారం చెప్పేందుకు నిరాకరించారు. చివరకు ఎలక్ట్రానిక్‌ మీడియా ముందు తాను ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌నని, ఐడీ కార్డు మర్చిపోయానని తెలిపారు. ఆయన్ని సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది గచ్చిబౌలి పోలీసులకు అప్పజెప్పారు. పోలీసుస్టేషన్‌కు వెళ్లాక అతను సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది తనను బలవంతంగా అపహరించారని, దూషించారని.. నేను, నా కుమారుడు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఫైబర్‌ లాఠీలతో కొట్టారని తప్పుడు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఆ సమయంలో నేను దిల్లీకి వెళుతున్నా. గచ్చిబౌలి పోలీసులు నాతో పాటు నా కుమారుడు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై కేసు పెట్టారు. ఇది ఏపీ సీఎం జగన్‌ సన్నిహితుడు, సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ద్వారా తెలంగాణ ఆంధ్ర పోలీసుల సాన్నిహిత్యానికి నిదర్శనం.”అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

కష్టడీలోనే అంతమొందించేందుకు కుట్ర

‘‘రాజకీయ ప్రేరణతో డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి నాపై తప్పుడు కేసులు మోపుతున్నారు. కస్టడీలోనే నన్ను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు కల్పించిన భద్రతను రద్దు చేయించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై తప్పుడు కేసులు పెట్టారు. ఇలాంటి విధానాన్నే సీఎం జగన్‌ నాయకత్వంలోని పోలీసులు సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై లోగడ ప్రయోగించారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసమున్న నేను ఈ అడ్డంకులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటున్నా. రూ.43 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న సీఎం జగన్‌ దురుద్దేశపూర్వక వైఖరికి వ్యతిరేకంగా మీ మద్దతు కోరుతున్నా’’ అని పేర్కొన్నారు.

Related posts

కూలిన నాంప‌ల్లి స‌రాయి హెరిటేజ్ భ‌వ‌నం

Satyam NEWS

రేపు వనపర్తికి జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు రాక

Satyam NEWS

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో చండీహోమం

Satyam NEWS

Leave a Comment