కరోనా అత్యంత తీవ్రంగా ఉన్న రోజుల్లో విశాఖ పట్నానికి చెందిన నలంద కిషోర్ ను పోలీసులు కేసులు పెట్టి కర్నూలు తీసుకెళ్లారని అందువల్లే అతను మరణించాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు అన్నారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు నలంద కిషోర్ పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు పెట్టారు. విశాఖపట్నం కు చెందిన నలంద కిషోర్ నేడు మరణించిన విషయం తెలిసిందే. దీన్ని పోలీసులు చేసిన హత్యగానే భావించాలని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలులో కరోనా పాజిటివ్ పేషంట్లను పెట్టే సెంటర్లో కిషోర్ను పెట్టారని, అందువల్లే కిశోర్కు కరోనా వచ్చినట్లు ఉందని ఆయన అన్నారు.
నలంద కిషోర్ మృతి తనను కలచివేసిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. అరోగ్యం బాగాలేకపోయినా నలంద కిషోర్ను కర్నూలుకు తీసుకెళ్లారు. కిషోర్ను తరలించిన సమయంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. కిషోర్ పెట్టిన పోస్టుల్లో ఎవరి పేరు లేకపోయినా అరెస్ట్ చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు అని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
మాట్లాడే హక్కే కాకుండా జీవించే హక్కునూ హరిస్తున్నారా? మన ప్రభుత్వంలో ఇలాంటి వేధింపులు ఎందుకు? కుటుంబాల శాపాలు ప్రభుత్వానికి మంచిది కాదు. ఇప్పటికైనా ప్రజల మనోభావాలను తెలుసుకోండి. సంక్షేమ పథకాలతోనే మనం ఎల్లకాలం మనుగడ సాధించలేం. ముఖ్యమంత్రిగారూ దయచేసి అర్థం చేసుకోండి అని ఆయన కోరారు.