కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. అశోక్ గజపతి రాజు కుటుంబం మహారాజుల కుటుంబమని ఆయన తన లేఖలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
తాత తండ్రి కాలం నుంచి ఎన్నో దేవాలయాలు నిర్మించడానికి ఆర్ధిక సాయంతో బాటు వేల ఎకరాల భూమిని దారాదత్తం చేసిన కుటుంబమని ఆయన గుర్తు చేశారు.
చదువుకునే పిల్లలకు స్కూలు ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు కల్పిస్తున్న కుటుంబం అది అని ముద్రగడ తెలిపారు.
రాజులు పోయినా రాజ్యాలు పోయినా మహారాజ కుటుంబాన్ని అందరూ గౌరవిస్తారని అలాంటిది విజయసాయి రెడ్డి ఆయనపై మాట తూలడం శోచనీయమని ముద్రగడ అన్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు మాన్సాస్ ట్రస్టు బాధ్యతలు మళ్లీ స్వీకరించిన అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామని విజయసాయిరెడ్డి హెచ్చరించడం బాధాకరమని ఆయన అన్నారు.
ఈ రోజుకూ క్షత్రియులను, వెలమ దొరలను పేరుతో ఎవరూ సంబోధించరని, దొరగారు అనే సంబోధిస్తారని ముద్రగడ గుర్తు చేశారు.
గౌరవంగా జీవించిన వారిని అవమానించడం మంచిపని కాదని ఆయన హితవు పలికారు.