బాధితుల సమస్యలను ములుగు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం నేరుగా విన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బాధిత ఫిర్యాదుదారుల సమస్యలు సత్వరం పరిష్కరించేందుకు ఎస్పీ ఈ చర్యలు తీసుకున్నారు.
క్రింది స్థాయిలో తమ సమస్యలు పరిష్కారం కాకుంటే వారి ఫిర్యాదులో న్యాయం ఉంటే ప్రజలు తన వద్దకు వస్తే స్వయంగా పరిష్కరిస్తానని ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఇదే సందర్బంగా మంగళవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వారి ఫిర్యాదులో నిజా నిజాలను తెలుసుకొని తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఎస్పీ స్వయంగా తమ సమస్యలు వినడం పట్ల బాధిత ఫిర్యాదు దారులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అన్యాయంగా ఇబ్బందులు కలగజేస్తే సహించబోయేది లేదని, వారి సమస్యలకు సత్వరమే పరిష్కారం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజలకు చేరువయ్యే అనేక కార్యక్రమాలను చేపడుతానని తెలియచేసారు.