ఆమె ఒక ప్రభుత్వ అధికారిణి… ఆకుపచ్చ కలం తో సంతకం చేసేంత హోదా… హాలం పట్టి పొలంలో పనులు చేసేంత ఓపిక… రెండు జిల్లాలకు సబ్ రిజిస్ట్రార్ ఆమె.. వారమంతా తన విధి నిర్వహణలో బిజీగా గడిపే ఆ అధికారిణి సెలవు దినాలలో మాత్రం సేద్యం పనులు చేస్తూంటారు.
కర్షకుల విలువలు ప్రపంచానికీ చాటి చెప్పడం కోసం ప్రతి సెలవు రోజున వ్యవసాయ పనులు చేస్తుంటారు… ఆమె ఎవరో కాదు ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. ఆదివారం సెలవు రోజు కావడంతో ములుగు జిల్లా ముద్దునూరు తండా గ్రామంలో గుగులోతు సంతోష్,వెన్నల దంపతుల వ్యవసాయ పొలంలో కూలీలతో కలిసి ఆమె నాట్లు వేశారు.
జిల్లా అధికారిణి తమతో నాటు వేయడానికి వచ్చారని ఆనదోత్సవంలో గిరిజన రైతు మహిళలు నృత్యం చేస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం తస్లీమా మాట్లాడుతూ ఆధునిక కాలంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక,పంటకు పెట్టిన పెట్టుబడి రాక ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారని, వ్యవసాయమే దండుగ అని చాలా మంది రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నారని అన్నారు.
అలా రైతు వ్యవసాయానికి దూరం అయితే మానవ మనుగడే కనుమరుగవుతుందని ,కాబట్టి ఇలాంటి తరుణంలో రైతులకు మీము ఉన్నాం అంటూ భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉండాలని సూచించారు. ఒకప్పుడు రైతు ఉండేవాడు అని చెప్పుకునే రోజు రాకుండా ఉండాలంటే కర్షకులకు బాసటగా నిలవాలని తస్లీమా అన్నారు.