ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కేంద్రానికి చెందిన ఒక నిరు పేద కుటుంబం కష్టాల కడలిలో చిక్కుకుని ఉంది. అలాంటి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవడానికి నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్.
యండి సలీమ్ పాషా-సలీమ్ సుల్తానా ల కుమారుడు ఆసాల్లమ్ పాషా కిడ్నీ ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్నారు. కుటుంబం కొడుకు ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఉండే ఇంటిని అమ్ముకున్నారు. ఆస్తులు ఏమీ లేని స్థితిలో ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
తన కిడ్నీ ఇచ్చేందుకు తండ్రి ముందుకు వచ్చాడు. అయితే ఆపరేషన్ కు కావాల్సిన డబ్బు….? ఎక్కడ నుంచి తేవాలి? కూలిపనులు చేసి జీవనం సాగించే సలీమ్ అంత డబ్బు ఖర్చు చేయలేని పరిస్థితి. ఆ కుటుంబ ఆర్థిక సమస్యను, వారి కుమారుడు ఆరోగ్య సమస్యను మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్, స్థానిక నాయకులు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ దృష్టి తీసుకొని వెళ్లారు.
మానవతా దృక్పథంతో స్పందించిన ఆయన మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకొని వెళ్లారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తక్షణ సాయంగా లక్ష రూపాయలు మంజూరు చేయించారు. ఇంకా ఖర్చులు భరించి బాబు ప్రాణాన్ని కాపాడుకుంటాం అని జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ భరోసా ఇచ్చారు.
చేతిలో చిల్లి గవ్వ లేక ఇబ్బంది పడుతున్న కుటుంబానికి సాయం చేసిన జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ కు,గి రిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.