ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని పరేల్లోని లాల్బాగ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ భారీ అంతస్తుల భవనంలో కొద్దిసేపటి క్రితం ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 19 అంతస్తులున్న ఈ భవనంలో 3వ అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదం సంభవించగానే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్లంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఓ వ్యక్తి మంటల నుంచి రక్షించుకునే ప్రయత్నం చేయగా, అదుపు తప్పి కింద పడిపోయాడు. చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి భారీగా అగ్నిమాపక శకటాలను రప్పిస్తున్నారు అధికారులు. అయితే ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అలాగే ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.