ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వీధులలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు పెంచిన వేతనాలు అమలు చేయక పోవటం సవతి తల్లి ప్రేమలా ఉందని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి అన్నారు. రాష్ట్రం లోని పురపాలక సంస్థల మేయర్ లకు నెలకి వేతనం 50,000 నుండి 65,000 రూపాయలు పెంచారని, అదే విధంగా కార్పొరేటర్లు, పురపాలక చైర్మన్లు,కౌన్సిలర్లు,ప్రజా ప్రతినిధులకు కూడా వేతనాలు పెంచారని ఆయన గుర్తు చేశారు. ఇది అన్యాయమని రోషపతి విమర్శించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం జరిగిన మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న శీతల రోషపతి మాట్లాడుతూ కేంద్రం లోని ప్రధానమంత్రి, ప్రక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి రైతుల ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని వారు వారు తీసుకు వచ్చిన రైతు మూడు వ్యవసాయ చట్టాలని, 3 రాజధానుల చట్టాలనీ వెనక్కి తీసుకున్నారని, ఎన్నో సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులు పోరాటం చేస్తున్నా ముఖ్యమంత్రి కెసిఆర్ కి మార్పు రాకపోవడం అన్యాయమని అన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అందర్నీ పర్మినెంట్ చేయాలని,కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర వేతన చట్టం తేవాలని,ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు యల్క సోమయ్య గౌడ్,కస్తాల ముత్తమ్మ,మెరుగు దుర్గారావ్, కస్తాల సైదులు,దేవ కర్ణ,కుమారి,రవి, చంద్రకళ, సైదులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్