శ్రీమచ్చింతామణి గణపతి నవరాత్రుల సందర్భంగా పలు సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో స్వయం వ్యక్తమైన లక్ష్మీనరసింహ దేవస్థాన ప్రాంగణం లోని శ్రీ లక్ష్మీ నృసింహ వేద స్మార్త పాఠశాల ఆవరణలో శ్రీమచ్చింతామణి గణపతి నవరాత్రుల సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేస్తూ ఆకట్టుకుంటున్నాయి.
పలువురి ప్రముఖుల ఆధ్యాత్మిక ప్రవచనాలు, విజయవాడ వాస్తవ్యులచే సంగీత విభావరి,హరికథా,వీణా నాదం కార్యక్రమాలు నయన మనోహరంగా, శ్రవణానందంగా నిర్వహించారు.నేటి అధునాతన కాలంలో పాశ్చాత్య సంస్కృతిని తలదన్నే స్వదేశీ సంప్రదాయ కళలకు ప్రాధాన్యతనిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ముగ్ధులైన భక్తులు తమ ఆనంద అభిప్రాయం వ్యక్తం చేశారు.
నిరంతరం వేద ఘోషతో పరిఢవిల్లుతున్న శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలలో అధ్యాపక,విద్యార్థులచే ప్రతిరోజూ శ్రీమచ్చింతామణి వరసిద్ధి గణపతికి ప్రాతఃకాల,ప్రదోష కాలంలో షోడశోపచార పూజలు,శ్రీ లక్ష్మీగణపతి హోమం,మహా నీరాజ మంత్రపుష్పం, తీర్ధప్రసాద వినియోగం జరుగుతుంది.
ఈ కార్యక్రమాల్లో లక్ష్మీనృసింహ స్వామి వారిని దర్శించుకున్న వివిధ రాష్ట్రాల,ప్రాంతాల భక్తులు,పాఠశాల వేద అధ్యాపకులు చీమలపాటి ఫణిశర్మ,పాఠశాల కార్యదర్శి సూరి లక్ష్మీనారాయణ శర్మ,సభ్యులు బాచిమంచి చంద్రశేఖర్ శర్మ,భువనగిరి శ్యామ్ సుందర్, రంగరాజు వాసుదేవరావు,బొబ్బళ్ళపాటి శేషు,పులిజాల శంకర్రావు,సుబ్రహ్మణ్యం,వేద విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్