ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాగుంట రాఘవరెడ్డి అమాయకుడని ఆయన తండ్రి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి సర్టిఫికెట్ ఇచ్చారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదని మాగుంట శ్రీనివాసులురెడ్డి చెప్పారు.
ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో మాగుంట మాట్లాడుతూ మా నాన్న గారు స్థాపించిన వ్యాపారం 70 సంవత్సరాల వ్యాపారం. ఇటువంటి వ్యాపారాలు పది రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నాము. అలాగే నాకు ఈ వ్యాపారంలో 50 సంవత్సరాల అనుభవం ఉంది. మాగుంట కుటుంబం ఏ రాష్ట్రంలో కూడా తప్పు చేయలేదు. నా కుమారుడు రాఘవరెడ్డిని కోర్టులో కలిసినప్పుడు,నాన్న పెదనాన్న సుబ్బరామిరెడ్డి గారి పేరు ఎప్పుడూ అప్రతిష్టపాలు చేయను. మీకు తలవంపులు వచ్చే పని కూడా చేయను అని నా కుమారుడు అన్నాడు.
అందుకే నాకు నా కుమారుడు మీద నమ్మకం ఉంది. నా కుమారుడు రాఘవరెడ్డి ఎక్కడా తప్పు చేయలేదు అని అన్నారు. అందుకే నేను ధైర్యంగా ఉన్నాను. దయచేసి మీరు ధైర్యంగా ఉండండని అటువంటి భరోసాతో గట్టిగా చెబుతున్నప్పుడు అనిపించింది, భగవంతుడా ఇటువంటి బిడ్డను నాకు ప్రసాదించినందుకు నీకు జన్మజన్మలకి రుణపడి ఉండాలని గర్వంగా కూడా ఎప్పుడూ ఉంటుంది అని ఆయన అన్నారు.
నేను రాజకీయాలలోకి వచ్చి 32 సంవత్సరాలు. సుబ్బారామరెడ్డి గారు నాకు రాజకీయ జీవితం ప్రసాదించిన తర్వాత, ఎటువంటి తప్పులు రాజకీయంలో కూడా చేయకుండా సజావుగా సాగిపోతున్న మాగుంట కుటుంబం ఇది. అందుకే మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు,ప్రకాశం జిల్లా ప్రజలందరికి మాగుంట కుటుంబం ఎప్పుడూ తప్పు చేయలేదు కనుక వారిని కుటుంబాన్ని ఆశీర్వదించండి. త్వరితగతిన ఈ సమస్యలన్నీ తీరిపోయేలా భగవంతుడ్ని ప్రార్ధించండని మాగుంట జిల్లా ప్రజలను కోరారు.