రైతే రాజు అన్న మాటని నిజం చేయటానికి అందరూ కంకణ బద్ధులై పనిచేయాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో లోని ఉప్పరిగుడా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం నిర్మాణానికి సీతరాoపేట్ లో నాబార్డ్ చైర్మన్ చింతల గోవింద రాజులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి ఎంపీ కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతే రాజు అని అందరూ అంటూ ఉంటారు కానీ ఇప్పటికీ రైతే రాజు కాలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును రాజును చేయటానికి అందరం కలిసి పనిచేయాలని, నాబార్డ్ ఛైర్మెన్ సహకారంతో ఇది సాధ్యం అవుతుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
గోడౌన్ల తో పాటు రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు కావాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల రైతులు పూర్తిగా వర్షాపాతం పై ఆధారపడతారని, వారికి వెయ్యి ఫీట్లు బోర్లు వేసిన నీరు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ని వర్షాలు పడ్డా ఈ ప్రాంతంలో చెరువులు నిండడం లేదని, అందుకే ప్రాజెక్ట్ ల పైననే ఇక్కడ రైతులు ఆధారపడ్డారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రైతులు ఎక్కువ ఉన్న చోట నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు ఎక్కువ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
దక్షిణ తెలంగాణ లో ప్రాజెక్ట్ లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని అందుకోసమే వాటికి నాబర్డ్ నుండి పూర్తి సహకారం అందించాలని కోరారు.