ఇతర మతస్థులను, ఇతర మతాల వారిని కించపరిచే విధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ ఎస్పి డాక్టర్ వై. సాయి శేఖర్ స్పష్టం చేశారు. మత విశ్వాసాలను రెచ్చగొట్టే విధంగా కానీ, ఇతర మతాల మనోభావాలను కించపరిచే విధంగా కానీ ప్రచారం చేసినా, సామాజిక మాధ్యమాలలో (సోషల్ మీడియా) అలాంటి వార్తలను ఫార్వార్డ్ చేసినా చర్యలు తప్పవని ఆయన నేడు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఒక మతాన్ని ఎక్కువ చేస్తూ, మరో మతాన్ని తక్కువ చేస్తూ ప్రచారం చేసినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇతర మతాల వారిని తక్కువ చేస్తున్న సమాచారాన్ని ఇతరులతో పంచుకున్నా అలాంటి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు తెలిపారు.
ఎవరైనా మత సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వారికి నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించి, ఆ తర్వాత వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అందువల్ల జిల్లా ప్రజలంతా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి ఇబ్బందులు పడవద్దని కోరుతున్నామని పోలీసు ఎస్పీ తెలిపారు.