సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన నేరంపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొద్ది రోజుల కిందట అరెస్టు చేసిన నలంద కిశోర్ శనివారం ఉదయం మరణించారు. కిశోర్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు. ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మూడు వారాల క్రితం కర్నూలు సీఐడీ పోలీసులు అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం నుంచి నేరుగా కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ న్యాయస్థానంలో హాజరుపర్చి, విచారించి ఆయనను తిరిగి వదిలేశారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగోలేదని ఆయన బంధువులు అంటున్నారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ఐదు రోజుల నుంచి ఆయన జ్వరంతో బాధపడుతున్నారు.