పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు ప్రధాన రహదారి మరమ్మత్తులకై కుల,మత,రాజకీయాలకు అతీతంగా నిరసన దీక్ష చేపడుతున్నట్లు దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ అన్నారు.
ఈరోజు స్థానిక నల్లగార్లపాడులోని అంబేద్కర్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ రావిపాడు నుండి నల్లగార్లపాడు వెళ్ళే ప్రధాన రహదారి పూర్తిగా పాడైపోయి ప్రజలు కనీసం కాలినడకన కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉందని ఆయన అన్నారు.
రహదారిని మరమ్మత్తులు చేయించాలని ఇప్పటికే స్థానిక నరసరావుపేట ఎమ్మెల్యే డా॥గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ని కలసి కోరామని తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ని కలసి స్పందనలో ఇప్పటికే రెండుసార్లు ఫిర్యాదు చేసినా స్వయంగా వచ్చి రోడ్డును పరిశీలించి రోడ్డు మరమ్మత్తులు చేయిస్తామని తెలిపినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన అన్నారు.
ఇప్పటికే గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులతో,గ్రామస్తులతో రోడ్డు సమస్యపై చర్చించామని గ్రామస్తులందరి మద్దతుతో ఈ నెల 10వ తేదీ నుండి నల్లగార్లపాడు గ్రామంలో నిరసన దీక్ష చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ దీక్షకు అన్ని రాజకీయపార్టీల మద్దతు కోరతామని అనంతరం భవిష్య ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని రమేష్ కుమార్ తెలిపారు.