కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉడాన్ పథకం కింద తెలంగాణలో అమలులోకి తెచ్చిన ఎయిరో ప్రాజెక్టులెన్నో వెల్లడించాలని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్రాన్ని లోక్ సభలో ప్రశ్నించారు.
దేశంలోని పలు పట్టణాలు, నగరాలను అనుసంధానం చేయడానికి నిర్దేశించబడిన లక్ష్యం నెరవేరిందా అని నిలదీశారు. లోకసభలో ఉడాన్ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని గురువారం లిఖిత పూర్వకంగా ఎంపీ నామ అడిగారు.
దేశంలోని పలు ప్రాంతాలను వాయు మార్గాల ద్వారా అనుసంధానం చేయడం కోసం ప్రారంభించబడిన ఉడాన్ పథకం ఉద్దేశ్యం నేరవేరిందా అని అడిగారు. ఉడాన్ పథకం ప్రారంభించబడినప్పటి నుంచి నేటికి వరకు తెలంగాణ రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా అనుసంధానం చేసిన ప్రాంతాలు వివరాలు తెలిపాలని కోరారు.
పని చేయని విమానాశ్రయాల వివరాలతో పాటు, ఉడాన్ సమీక్షలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించాలని కోరారు. నిలకడ లేని మార్గాలు, కార్యాచరణ సాధ్యమయ్యే విమానశ్రయాల పునరాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన విధానాలు, విమానాశ్రయాల అభివృద్ధి, నవీకరణ కోసం అదనపు భూమి అవసరమనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారా అని ఎంపీ నామ తన రాతపూర్వక ప్రశ్నలో పేర్కొన్నారు.
సభలో ఎంపీ నామ అడిగిన ప్రశ్నలకు కేంద్ర రహదారులు, విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ సమాధానం ఇస్తూ ఉడాన్ పథకంలో భాగంగా 59 విమానాశ్రయాలతో 359 ప్రాంతీయ మార్గాలను సెలెక్టెడ్ ఎయిర్ లైన్ ఆపరేటర్లు (సావోస్) ద్వారా అమలు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ను కలిపి 26 మార్గాలు, నాగార్జున సాగర్ ను కలిపే 4 సీప్లేన్ మార్గాలు సెలెక్టెడ్ ఎయిర్లైన్ ఆపరేటర్లు (సావోస్) కు లభించాయని మంత్రి తన జవాబులో వివరించారు.