బాలయ్య ఏం చేసినా సంచలనమే. సినిమాల్లో నటించినా, రాజకీయాల్లో పోటీ చేసినా నందమూరి బాలకృష్ణ సంచలనాలకు నిలయంగానే ఉన్నారు. హీరోగా 106 సినిమాలకు పైగా నటించిన బాలకృష్ణ ఈమధ్య తొలిసారిగా ఓటీటీ ప్లాట్ ఫారం పైకి వచ్చారు. ఆహా యాప్ లో ఆయన కోసమే ప్రత్యేకంగా రూపొందించిన అన్ స్టాపబుల్ అనే కార్యక్రమంలో తొలిసారి ఆయన బుల్లి తెరపైకి వచ్చినప్పుడు అదొక సంచలనంగా మారింది.
అన్ స్టాపబుల్ కార్యక్రమం విపరీతంగా సక్సెస్ అయింది. రియాలిటీ షోలకే అమ్మ మొగుడు అంటూ ఆయన అన్ స్టాపబుల్ 2 ఇటీవలె ప్రారంభించారు. ప్రారంభం ప్రారంభమే ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో కలిసి అన్ స్టాపబుల్ 2 సీజన్ లో తొలి ఎపిసోడ్ చేయడంతో ఆహా యాప్ ఒక్క సారిగా విపరీతమైన పాపులారిటీ సాధించింది. అన్ స్టాపబుల్ కార్యక్రమం బాలకృష్ణ చేస్తారని ఎవరూ ఊహించలేదు.
అలాంటి బాలయ్య ఇప్పుడు మరో సంచలనం సృష్టించబోతున్నారు. ఆయన ఇప్పటి వరకూ తెరపై చేయని పనిని ఇప్పుడు చేస్తున్నారు. అదేమిటంటే ఆయన యాడ్ లో నటించబోతున్నారు. దాదాపు అందరు హీరోలు, హీరోయిన్లు, డిమాండ్ ఉన్న నటులు అందరూ ప్రకటనలలో బ్రాండ్ అంబాసిడర్లుగా నటించినా ఇప్పటి వరకూ బాలకృష్ణ ఆ పని చేయలేదు. ఇప్పుడు తాజాగా ఆయన ఒక ప్రకటనలో నటించబోతున్నారు. ఈ ప్రకటన ద్వారా వచ్చిన పారితోషికం అంతా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు ఇస్తున్నారట. ఇప్పుడు బాలయ్య అభిమానులంతా ఆ యాడ్ ఫిలిం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.