కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మెసలుకోవాలని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు.
ఈ పోరులో ప్రభుత్వాలు బాధ్యతగా పని చేయాలని అదే సమయంలో ప్రజలు కూడా అంతే బాధ్యతాయుతంగా ఉండి తమను తాము పరిరక్షించుకోవాలని ఆయన సూచించారు.
వాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే వాక్సిన్ రావాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఇప్పటికే ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారని ఈ ప్లాస్మా వలన చాలా మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నారని వివరించారు.
అలానే కరోనా పట్ల భయం వదలి కరోనాను జయించాలని విజ్ఞప్తి చేశారు. నేటి ఉదయం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు సంగారెడ్డి మహేశ్వర మెడికల్ కాలేజి హాస్పిటల్ 1000 PPE కిట్లు, 1000 N95 మాస్క్ లను అందించింది. వాటిని మహేశ్వర మెడికల్ కాలేజీ చైర్మన్ TGS మహేష్ నుంచి బాలకృష్ణ స్వీకరించారు.
మహేశ్వర మెడికల్ కాలేజీ చేస్తున్న ఈ సహాయం క్యాన్సర్ హాస్పిటల్ వారు కోవిడ్ పై చేస్తున్న పోరాటానికి ఎంతో సహాయకారిగా నిలుస్తుందని బాలకృష్ణ అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ నందమూరి బాలకృష్ణ తో పాటూ BIACH&RI CEO డాక్టర్ ఆర్ వి ప్రభాకర రావు, మెడికల్ డైరెక్టర్ డా. టియస్ రావు, COO జి రవికుమార్, అసోసియేట్ డైరెక్టర్ డా. కల్పనా రఘునాథ్, మహేశ్వరి మెడికల్ కాలేజీ డిప్యూటీ డైరెక్టర్ డా. సవిత, ప్రొఫెసర్ డా. దేవరాయ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
నో సెక్యూలర్:ఢిల్లీ ప్రజలు బీజేపీకి బుద్ది చెప్పారు