వచ్చే ఎన్నికల్లో విజయం తప్ప వేరే ఆప్షన్ తెలుగుదేశం పార్టీకి లేదు. అందుకే పార్టీ అధినేత చంద్రబాబు తన సహజ స్వభావానికి భిన్నంగా దూకుడైన రాజకీయం చేస్తున్నారు. ఇప్పటివరకు 156 నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించి అభ్యర్థులను ముందే ఖరారు చేస్తున్నారు. పనితీరు బాగోలేనివారికి, సర్వేలో తక్కువ మార్కులు వచ్చినవారికి సీటు విషయమై గ్యారంటీ ఇవ్వడంలేదు.
ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ సీటు ఆశిస్తున్నారు. ఇటీవలి కాలంలో అఖిలప్రియ పలు వివాదాల్లో చిక్కుకోవడంతో ఆళ్లగడ్డలో కూడా పార్టీని బలోపేతం చేయలేదు. దాంతో ఆమెకు సీటు విషయమై చంద్రబాబునాయుడు హామీ ఇవ్వలేదు. అయితే భూమా కిషోర్ రెడ్డిని టీడీపీ తరఫున బరిలోకి దింపాలని చంద్రబాబు యోచిస్తున్నారు. నంద్యాల నియోజకవర్గాలపై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఇన్ఛార్జిగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డితోపాటు కొందరు కీలక నేతలు హాజరయ్యారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను బ్రహ్మానందరెడ్డి చంద్రబాబుకు వివరించారు. వివరాలన్నింటినీ క్రోడీకరించిన చంద్రబాబు నియోజకవర్గంలో తర్వాత ఏమేం చేయాలో అతనికి వివరించారు. సీటు ఇతరులకిస్తున్నామనికానీ ఏదీ చెప్పలేదు.
దాదాపుగా నంద్యాల సీటు నుంచి ఈసారి బ్రహ్మానందరెడ్డి అభ్యర్థి అవుతారని భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన బ్రహ్మానందరెడ్డి 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. నంద్యాల నియోజకవర్గంలో ఇంకా బాగా పనిచేయాలని సూచించడంతోపాటు కొన్ని సలహాలను కూడా చంద్రబాబు ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఈసారి మెజారిటీ సీట్లు సాధించాలనేది చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.