వరదలు, తుఫాన్లతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ నెలాఖరులోగా రాష్ట్రవ్యాప్తంగా వున్న రైతాంగాన్ని ఆదుకోకపోతే ఉద్యమం తప్పదని ముఖ్య మంత్రికి లేఖలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు.
ప్రకృతి వైపరీత్యాలతో ఆంధ్రప్రదేశ్లోని రైతులు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచీ వరదలు, తుఫాన్లతో తీవ్ర నష్టాల పాలవడం దురదృష్టకరం. కృష్ణ, గోదావరి నదులకు వచ్చిన వరదలతోపాటు భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వ్యవసాయరంగానికి తీరని నష్టాన్ని మిగిల్చాయి.
అక్కడక్కడా మిగిలిన పంటలను నివర్ తుఫాను పూర్తిగా తుడిచిపెట్టింది.కడప జిల్లాలో పప్పుధాన్యాలు, అనంతపురం జిల్లాలో వేరుశనగ, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి జిల్లాల్లో వరి పంటలకు అపారనష్టం వాటిల్లింది. 50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఒక్క ఖరీఫ్ సీజన్లో మాత్రమే 10,000 కోట్ల రూపాయలు పంటలను రైతులు నష్టపోయారు.
అయితే వరదలు, తుఫాన్ల సందర్భంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పంట నష్టపరిహారం లెక్కించడంలోనూ అలసత్వం ప్రదర్శించింది.
చివరికి పంటల బీమా ప్రీమియం చెల్లించామని వ్యవసాయశాఖా మంత్రి సభలో అవాస్తవాలు చెప్పి… శాసనసభలో ప్రతిపక్షనేత నిలదీస్తే ..ఆ రోజు అర్ధరాత్రి బీమా ప్రీమియం చెల్లింపునకు జీవో జారీ చేయడం రైతుల సమస్యల పట్ల కనీస బాధ్యత లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందని తేటతెల్లమైంది.
ఈ నెలాఖరులోగా రైతుల సమస్యలు పరిష్కరించి, తుఫాన్లు, వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోకపోతే తెలుగుదేశం అన్నదాతలకు న్యాయం చేసేందుకు ఉద్యమం చేపడుతుందని లేఖలో పేర్కొన్నారు.
జరిగిన నష్టం అపారంగా కనిపిస్తుంటే, తక్షణం స్పందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం తప్పించుకోవడానికి ఎందుకు చూస్తోందని లేఖలో కొన్ని ప్రశ్నలను సంధించారు నారా లోకేష్.
1) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్బివై), వాతావరణ ఆధారిత పంట బీమా పథకం కింద పంటలను ఎందుకు బీమా చేయలేదు?
2) పంట నష్టపరిహారం లెక్కింపులో జాప్యమెందుకు అవుతోంది?
3) ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు వరదల్లో పంటనష్టపోయిన ప్రజలకు తక్షణ సహాయంగా 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరే ముఖ్యమంత్రిగా రూ.500 పరిహారంగా ఇవ్వడం సముచితమేనా?
నిబంధనలు అడ్డుగా నిలిచినా ప్రకృతివైపరీత్యాలు, వరదలు సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం బాధితులు, రైతుల్ని ఆదుకోవడంలో ఉదారంగా వ్యవహరించిందని, జగన్రెడ్డి ప్రభుత్వం నిబంధనలు పేరుతో రైతాంగాన్ని ఆదుకోవడంలో ఉదాశీనంగా వ్యవహరిస్తోందని లేఖలో ఆరోపించారు.
1) ఈ క్రాప్ ద్వారా పంట నష్టపరిహారం లెక్కింపులో పారదర్శకత లోపించి, కనీసం ముందుకు సాగడంలేదు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంట నష్టం గణన పూర్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.
2) పంట నష్టాన్ని చాలా తక్కువగా లెక్కిస్తున్నారు. రైతులకు జరిగిన నష్టం అపారం, దీనిని దృష్టిలో ఉంచుకుని వందశాతం నష్టం లెక్కించాలి.
3) పంట నష్టపోయిన రైతులకు హెక్టార్ కు రూ.30 వేలు, ఉద్యాన పంటలకు హెక్టారుకు రూ.50వేలు చొప్పున పరిహారం చెల్లించాలి.
4) పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా వరదలు, తుఫాన్లకు పాడైన పంటలకు కూడా కనీస మద్దతు ధర ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేయాలి.
5) పంటల బీమా ప్రీమియం రైతుల వాటాని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చి, నేడు చెల్లించకపోవడం దారుణం. లోక్సభ సాక్షిగా పంటల బీమా ప్రీమియం చెల్లించని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తేలిపోయింది. పంటపోయాక ప్రీమియం చెల్లించినా రైతులకు బీమా వర్తించదు. ఇచ్చిన మాటకు కట్టుబడి పంటకు ముందే బీమా ప్రీమియం చెల్లించాలి.
6) పోయిన పంటల స్థానంలో మళ్లీ సాగు చేసుకునే రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలి.
రైతుల్ని ఆదుకోవడాన్ని ఇచ్చిన సూచనలు పరిగణనలోకి తీసుకుని, డిసెంబర్ 31లోగా అన్నదాతల్ని ఆదుకోవడానికి చర్యలు తీసుకోకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుందని లేఖలో నారా లోకేష్ హెచ్చరించారు.