పల్నాడు జిల్లా గురజాల, మాచర్ల ల్లో కొత్తగా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కోరారు.
ఈ మేరకు ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి అభ్యర్థించారు. పల్నాడు జిల్లాలో 75శాతం పైగా ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు చదువు, పోషకాహారాలను అందించే అంగన్వాడీ కేంద్రాలను పల్నాడు జిల్లాలో కొన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గురజాల అంగన్వాడీ ప్రాజెక్టులోని దుర్గి, కారంపూడి మండలాలకు సంబంధించి మొత్తం లక్షకు పైగా జనాభా ఉంటే.. ప్రస్తుతం 95 అంగన్వాడీ కేంద్రాలు మాత్రమే ఉన్నాయని, దుర్గికి 3, కారంపూడిలో 2అంగన్వాడీ కేంద్రాలు కొత్తగా ఏర్పాటు చేయాలన్నారు.
మాచర్ల అంగన్వాడీ ప్రాజెక్టులోని మాచర్ల మున్సిపాలిటీ, మాచర్ల, రెంటచింతల, వెల్దుర్తి మండలాల్లో 2లక్షల 10వేలకు పైగా జనాభా ఉంటే ప్రస్తుతం 172 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని, ఇప్పుడు మాచర్ల మున్సిపాలిటీకి మరో 39, రెంటచింతల మండలానికి 8 కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.
ఈ విషయాలపై మంత్రి స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.