హైదరాబాద్, గుంటూరు వయా మాచర్ల మీదుగా ఉన్న రహదారిని 4 వరసల రోడ్డుగా విస్తరించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రవాణా, రోడ్లు, భవనాల శాఖల ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుని విజయవాడలోని ఆయన కార్యాలయంలో కలసి వినతిపత్రం అందించారు.
హైదరాబాద్–గుంటూరు మార్గంలో ప్రజా రవాణా అధికంగా ఉంటుందని, వాణిజ్య, వర్తక రవాణా దృష్ట్యా రోజు రోజుకి ఈ మార్గంలో వాహనాల రద్దీ అధికం అయ్యి తరుచుగా రోడ్డు పాడవుతూ ఉంటుందని వారు తెలిపారు. దీని నిర్మాణానికి రూ.30కోట్లు వ్యయం అవుతుందని వారు అంచనా వేశారు.
అలాగే మాచర్ల నియోజకవర్గంలోని మండాది నుండి కొత్త పుల్లారెడ్డి గూడెం వరకు ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్డును 2 వరసలుగా విస్తరించాలని వారు కోరారు. ఇందుకు రూ.25కోట్లు ఖర్చవుతుందని వారు అంచనా వేశారు. వ్యవసాయం అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఈ రోడ్డును విస్తరించి రైతుల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని కోరారు.
ఈ రెండు మార్గాలను సీఆర్ఎఫ్(కేంద్ర రహదారుల నిధుల పథకం) కింద ఆమోదించి అభివృద్ధి చేయించాలని కృష్ణబాబుని ఎంపీ, ఎమ్మెల్యేలు కోరారు.