ప్రముఖ నటుడు, సుల్తాన్ బజార్ నర్సింగ్ యాదవ్గా పేరుప్రఖ్యాతలు గాంచి, కామెడీ, యాక్షన్, విలన్గా యాక్టింగ్లో తనదైన శైలిలో నటిస్తూ ప్రజలు, ప్రేక్షకుల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్న నర్సింగ్ యాదవ్ (52) సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయనకు భార్య చిత్ర, కుమారుడు రిత్విక్ యాదవ్.
ఈయన 300వందలకు పైగా సినిమాల్లో నటించారు. హేమాహేమీలు సినిమాతో సినిమా ఇండస్ర్టీకి పరిచయమైన నర్సింగ్ యాదవ్ అనేక చిత్రాల్లో నటించారు.
ఓ మారు సుల్తాన్ బజార్లోని కబుతర్ ఖానా (అనేక సినిమాల్లో చూశాము.. పావురాలు ఎగురుతున్నట్లుగా కనిపించే ఓ ప్రాంతం) సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంగా ఈయనపై సినీ నిర్మాతలు, డైరెక్టర్ల కన్నుపడింది. ఈయన మాట తీరును చూసి విలన్గా సినిమాలో ఎంపిక చేశారు. అనంతరం నుంచి ఆయన సినీ జీవితంపై ఆసక్తి పెంచుకొని సినిమాల్లో నటించడం మొదలెట్టి మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
అన్నా గిదేందే… అరే ఊరుకోరభయ్.. ఇలా అనేక డైలాగులతో ఏమీ తెలియని వారిలా నటిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తి తాను సినీ రంగంలోకి ఇప్పుడిప్పుడే వచ్చినా పరిణితి చెందిన వ్యక్తిలా నటిస్తూ ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. నర్సింగ్ యాదవ్ 1963 మే 15న జన్మించారు.