నాథ్ బయో కంపెనీ కింగ్ 101 రకం పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సాగుతున్న పోరాటం రాజకీయలబ్ధి కోసం కాదని, కేవలం రైతుల కోసం మాత్రమేనని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని సదుద్దేశంతో మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశం వర్షం కారణంగా వాయిదా వేయడం జరిగిందని ఆయన తెలిపారు. అయినా కొందరికి సమాచారం రాకపోవడంతో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు వచ్చిన రైతులతో ఆయన చర్చించారు.
ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కింగ్ రకం పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన కొందరు రైతులు కన్జ్యూమర్ కోర్ట్ ను ఆశ్రయించగా వారిలో కొందరికి మాత్రమే న్యాయం జరిగిందని తెలిపారు. ఈ ఘటనను ఆధారంగా తీసుకొని హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేసేందుకు తాము సిద్ధమయ్యామని తెలిపారు.
అందుచేతనే నష్టపోయిన రైతులు తమ వద్ద ఉన్న బిల్లులను తీసుకువస్తే హైకోర్టును ఆశ్రయిస్తామని, బిల్లు లేని వారి గురించి సైతం కోర్టు ద్వారా సలహాలు తీసుకుంటామని తెలిపారు. కానీ కొందరు తనను విమర్శించడం సరికాదన్నారు.
కింగ్ రకం పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన 3,250 మంది రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని, రాజకీయ లబ్ధి కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. వర్షం కారణంగా రద్దయిన ఈ సమావేశాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని, దానికి సంబంధించిన తేదీని త్వరలో ప్రకటిస్తామని అన్నారు.